Nandamuri Fans | ఒక కుటుంబ హీరోల ఫ్యాన్స్, మరో కుటుంబ హీరోల అభిమానులతో గొడవపడితే ఏదైనా అర్థం ఉంటుంది.. కానీ వాళ్లలో వాళ్ళ గొడవపడితే ఎలా ఉంటుంది చెప్పండి. అప్పట్లో మెగా ఫాన్స్ మధ్య ఇలాంటి గొడవలే వచ్చాయి. అల్లు అర్జున్, చిరంజీవి వర్గాల మధ్య ఏదో గొడవ నడుస్తుందని.. అల్లు వారబ్బాయి సొంతంగా ఎదిగాను అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అప్పట్లో చర్చ బాగానే జరిగింది. దానికి తోడు పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అని చెప్పడం కూడా అప్పట్లో సంచలనం అయింది. అయితే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మేమంతా ఒక్కటే అని మెగా హీరోలు చెప్తూనే ఉంటారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు నందమూరి అభిమానుల మధ్య కూడా ఇలాంటి గొడవలే జరుగుతున్నాయి. నిజానికి జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ అభిమానుల మధ్య ఎప్పటినుంచో ఆ గ్యాప్ కనిపిస్తూనే ఉంది. వాళ్ల కొత్త సినిమాలు విడుదలైనప్పుడు అది స్పష్టంగా బయటకు వస్తుంది. ఇప్పుడు కూడా బాలయ్య సినిమా విడుదల నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగవంత్ కేసరి సినిమాను చూడొద్దు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం సెన్సేషన్ అవుతుంది. అలాగే బాలయ్య అభిమానులు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను అదే రేంజ్ కౌంటర్ ఇస్తున్నారు.
తాజాగా ఏపీలోని ఒక థియేటర్ దగ్గర బాలయ్య బ్యానర్ మీద జూనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉందని అభిమానులు కోపంతో ఊగిపోయారు. మా హీరో బ్యానర్ మీద ఆయన ఫోటో ఎందుకు ఉండాలి అంటూ కాళ్ళ కింద వేసుకొని తొక్కి పడేశారు. ఈ విజువల్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ ను బాలకృష్ణ పక్కన చూడడానికి కూడా అభిమానులు అసలు ఒప్పుకోవడం లేదు. అదే స్థాయిలో ఎన్టీఆర్ అభిమానులు కూడా బాలయ్య విషయంలో వ్యవహరిస్తున్నారు.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఇప్పటివరకు తారక్ ఎలాంటి కామెంట్ చేయకపోవడం.. కనీసం ఒక బైట్ కూడా విడుదల చేయకపోవడంతో పూర్తి స్థాయిలో అతన్ని దూరం పెట్టారు నందమూరి అభిమానులు. ఊహించిన దాని కంటే ఈ విషయం ఇంకా పెద్దది అయిపోయింది. నిజానికి ఆ మధ్య ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు జూనియర్ రానప్పుడే తెలుగుదేశం కార్యకర్తలు ఎన్టీఆర్ పై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాత జయంతి కంటే నీ బర్త్ డే ఎక్కువైపోయిందా అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పుడు భగవంత్ కేసరి సినిమా సమయంలో ఎన్టీఆర్, బాలయ్య ఫ్యాన్స్ మధ్య వివాదాలు మరోసారి బయటపడ్డాయి. ఇవింకా ఏ స్థాయికి వెళ్తాయి అనేది ఆసక్తికరమే.