‘దిల్’ సినిమాతో 2003లో ప్రారంభమైన మా సంస్థ ప్రయాణం 50 చిత్రాల మైలు రాయికి చేరుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ లా మా సంస్థ 50 ఏళ్ల లోగో చూడాలన్నదే నా కల అన్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. ఆయన తొలిసారి నిర్మించిన వెబ్ సిరీస్ ఏటీఎం (ఎనీ టైమ్ మెమొరీ) అనౌన్స్ మెంట్ గురువారం హైదరాబాద్ లో ఈ వెబ్ సిరీస్ ను దర్శకుడు హరీశ్ శంకర్, జీ5 సంస్థలతో కలిసి దిల్ రాజు ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ వెబ్ సిరీస్ కు చంద్రమోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. నిర్మాతగా 50 చిత్రాలను పూర్తి చేశాను. హిట్, జెర్సీ సినిమాలతో దిల్ రాజు ప్రొడక్షన్స్ బాలీవుడ్ లోనూ సక్సెస్ ఫుల్ గా అడుగుపెట్టింది. తర్వాత ఏంటి అనుకున్నప్పుడు ఈ తరం ఎక్కువగా ఆదరిస్తున్న వెబ్ సిరీస్ మీద దృష్టి మరలింది. మా వారసులు హర్షిత్, హన్షిత ప్రొడక్షన్ బాధ్యతలు చూసుకున్నారు. హరీశ్ శంకర్ సినిమాల్లోని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటూనే కొత్త కాన్సెప్ట్ తో ఏటీఎం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు. దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడుతూ…డబ్బులు ఉంటే సినిమాలు ప్రొడ్యూస్ చేయడం కాదు అదొక ఆర్ట్. ఏటీఎం కథ అనుకున్నప్పుడు నాకు తోచిన ఏకైక నిర్మాత దిల్ రాజన్న. చంద్రమోహన్ నేను రాసిన కథను ఎపిసోడ్ క్రమంలో ఆసక్తికరంగా మార్చాడు. ఏటీఎం కొత్తగా ఉంటుందని చెప్పగలను. అన్నారు. ఈ కార్యక్రమంలో రచయిత ఫణి, జీ5 ప్రతినిధి పద్మ పాల్గొన్నారు.