Harish Rao | ‘కేసీఆర్ అంటే ఓ చరిత్ర. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా పదేళ్ల పాటు అభివృద్ధి పథంలో నడిపించారు. కేసీఆర్గారు పల్లెలతో పాటు హైదరాబాద్ను అద్భుతంగా అభివృద్ధి చేశారు. కేవలం భౌతికపరమైన అభివృద్ధే కాకుండా సామాజికంగా, సాంస్కృతికంగా రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అగ్రపథంలో నిలిపారు. ఈరోజు తెలంగాణ దేశానికి దిక్సూచిలా నిలబడిందంటే అందుకు కేసీఆర్గారు చేసిన కృషియే కారణం’ అన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. జబర్దస్త్ నటుడు రాకింగ్ రాకేష్ స్వీయ నిర్మాణంలో హీరోగా నటించిన చిత్రం ‘కేశవ చంద్ర రమావత్’ (కేసీఆర్). గరుడవేగ అంజి దర్శకత్వం వహించారు. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం హైదరాబాద్లో ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ వేడుకకు హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమా ద్వారా కేసీఆర్గారు తెలంగాణ కోసం చేసిన పోరాటాన్ని ప్రజలకు చూపించే గొప్ప ప్రయత్నాన్ని చేశారు రాకేష్. సాధారణంగా ఎవరైనా పవర్లో ఉన్న పార్టీ మీద సినిమా తీస్తారు. కానీ అధికారంలో లేని పార్టీ మీద సినిమా తీశాడంటే అది అతనికి తెలంగాణపై ఉన్న ప్రేమ, దమ్ము.. ధైర్యం అనుకోవచ్చు. ముఖ్యమంత్రులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన ఒకే ఒక్కరు కేసీఆర్. తద్వారా ఆయన ఓ చరిత్ర సృష్టించారు. అటువంటి కేసీఆర్గారి మీద సినిమా తీయడం అభినందనీయం. తెలంగాణ మీద సోయి వున్న వాళ్లు, తెలంగాణ ప్రేమికులు, కేసీఆర్ అభిమానులందరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నా’ అన్నారు.
చిత్ర టీజర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘తెలంగాణలో ఎక్స్ప్లోర్ చేయాల్సిన కథలెన్నో ఉన్నాయి. ఇక్కడ అనేక వర్ణాలు, ఉద్వేగాలతో కూడిన గొప్ప జీవనం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆత్మను ప్రతిఫలించే సినిమాలు ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం గిరిజనుల మీద అణచివేత గురించిన చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంలో రాకేష్ గిరిజనుల మీద సినిమా తీశాడు. ఇందులో తెలంగాణ లంబాడి యువకున్ని హీరో చేసినందుకు రాకేష్ను అభినందిస్తున్నా. ఇలాంటి మరిన్ని కథలతో తెలంగాణ సినిమాకు స్వర్ణ యుగం రావాలని కోరుకుంటున్నా’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, దర్శకుడు ఎన్.శంకర్, వైకాపా నేత, సినీ నటి రోజా తదితరులు పాల్గొన్నారు.