సత్యదేవ్, తమన్నా జంటగా నటించిన సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కన్నడ హిట్ ఫిల్మ్ ‘లవ్ మాక్ టైల్’ ఆధారంగా దర్శకుడు నాగశేఖర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. భావన రవి, నాగశేఖర్, రామారావు చింతపల్లి నిర్మాతలు. లాక్డౌన్ వల్ల విడుదల ఆలస్యమైన ఈ చిత్రాన్ని జూలై 15న విడుదల చేస్తున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగశేఖర్ మాట్లాడుతూ…‘మనమంతా జీవితంలో ఏదో ఒక సమయంలో స్థిరపడతాం. అప్పటికి వయసులో ఓ దశకు చేరుకుంటాం. ఈ ప్రయాణమంతా మనకు టీనేజ్ లవ్, ఇతర సందర్భాలు గుర్తొస్తూ ఉంటాయి. ఆ ప్రేమ కథల సమాహారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ చిత్రంతో ప్రేక్షకులు మరోసారి తమ జ్ఞాపకాల్లోకి వెళ్తారు. ప్రేమ, వినోదం వంటి అంశాలు ఆకట్టుకుంటాయి’ అన్నారు. ఈ చిత్రానికి ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ : సత్యహెగ్డే, సంగీతం : కాలభైరవ.