సంక్రాంతి మహేశ్కి లక్కీయస్ట్ పండగ. ఒక్కడు, బిజినెస్మ్యాన్, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, సరిలేరు నీకెవ్వరూ.. ఈ విజయాలన్నీ సంక్రాంతి రిలీజులే. ఇప్పుడు ‘గుంటూరుకారం’ రాబోతున్నది. సెంటిమెంట్ పరంగా ఇదీ హిట్టేనని అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కాస్త ఆలస్యమైనా శ్రద్ధగా సినిమాను చెక్కుతున్నాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మహేశ్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు విమర్శకుల ప్రశంసలందుకున్నాయి.
ఈ సినిమా వాణిజ్యపరంగా కూడా ఘన విజయం సాధించాలనే కసితో త్రివిక్రమ్ పనిచేస్తున్నారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ను నిర్మాతలు నెల క్రితమే మొదలుపెట్టారు. ఇప్పటికే విడుదలైన తొలిపాట అభిమానులకు తెగ నచ్చేసింది. ఈ నెల 13న మేకర్స్ రెండో పాటను విడుదల చేయనున్నారు.
తమన్ సంగీత సారథ్యంలో ‘ఓ మై బేబీ..’ అంటూసాగే ఈ పాట ఫ్యాన్స్కు వినసొంపుగా, కనసొంపుగా ఉంటుందని టాక్. ఈ పాటకు చెందిన ప్రోమోను ఈ నెల 11న సాయంత్రం 4.30 నిమిషాలకు విడుదల చేయనున్నట్టు తెలియజేస్తూ, ఈ పాటకు సంబంధించిన స్టిల్ని కూడా మేకర్స్ విడుదల చేశారు. మహేశ్ని ముద్దుల్లో ముంచెత్తుతున్న శ్రీలీలను ఈ స్టిల్లో చూడొచ్చు. పేరుకు తగ్గట్టే మాస్ మెచ్చే విధంగా ‘గుంటూరుకారం’ ఉండనుందని టాక్. మరి ఈ సినిమా చేసే పండగ హంగామా ఏ స్థాయిలో ఉంటుందో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.