మహేష్బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘గుంటూరు కారం’ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అతడు, ఖలేజా వంటి బ్లాక్బస్టర్ చిత్రాల తర్వాత మహేష్బాబు-త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది.
శనివారం ‘కుర్చీ మడతపెట్టి’ అనే గీతాన్ని విడుదల చేశారు. హుషారెత్తించే మాస్ బీట్తో ఈ పాటను తీర్చిదిద్దారు. ‘రాజమండ్రి రాగమంజరి..మాయమ్మ పేరు తెల్వనోళ్లు లేరు మేస్త్రీ..సోకులాడి స్వప్నసుందరి..తూనీగా నడుములోన తూటా పెట్టి తుపాకీ పేల్చినావే తింగరి చిట్టి’ అంటూ జానపద శైలిలో ఈ గీతం సాగింది. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటకు తమన్ స్వరాల్ని సమకూర్చారు. ఈ పాటలో మహేష్బాబు-శ్రీలీల వేసిన స్టెప్పులు ఎనర్జిటిక్గా అనిపించాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.