Rohit Shetty |ముంబై నగరంలో అర్ధరాత్రి చోటుచేసుకున్న కాల్పుల ఘటన కలకలం రేపింది. జుహూ ప్రాంతంలో ఉన్న ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ షెట్టి నివాసం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడినట్టు సమాచారం. వరుసగా నాలుగు రౌండ్లలో బుల్లెట్లు పేల్చిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనతో జుహూ ప్రాంతం ఒక్కసారిగా అలర్ట్ మోడ్లోకి వెళ్లగా, బాలీవుడ్ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.కాల్పులు జరిగిన సమయానికి రోహిత్ షెట్టి ఇంట్లో ఉన్నారా లేదా అన్నది ఇంకా స్పష్టతకు రాలేదు. అయితే జాగ్రత్త చర్యగా ఆయన నివాసం చుట్టుపక్కల భారీగా పోలీసు బలగాలను మోహరించారు. ప్రాంతాన్ని హై అలర్ట్ జోన్గా ప్రకటించి రాత్రంతా తనిఖీలు నిర్వహించారు.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగలేదని పోలీసులు వెల్లడించారు. జుహూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులకు గల కారణాలపై అనేక కోణాల్లో విచారణ సాగుతోంది. సంఘటన స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందం బుల్లెట్ షెల్స్, ఇతర ఆధారాలను సేకరిస్తోంది. సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తూ అనుమానితుల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని ముంబై పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
రోహిత్ షెట్టి హిందీ చిత్రసీమలో యాక్షన్ మరియు కామెడీ సినిమాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు. ‘గోల్మాల్’ సిరీస్తో విపరీతమైన ప్రజాదరణ పొందిన ఆయన, ‘సింగమ్’, ‘సింబా’, ‘సూర్యవంశీ’, ‘చెన్నై ఎక్స్ప్రెస్’, ‘దిల్వాలే’ వంటి బ్లాక్బస్టర్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు. ప్రస్తుతం ‘గోల్మాల్ 5’ చిత్ర నిర్మాణంలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన నివాసం సమీపంలో కాల్పులు జరగడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు.