పురస్కారాలు బాధ్యతను పెంపొందించే ప్రోత్సాహకాలుగా ఉపకరిస్తాయని అన్నారు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్. సినీ పరిశ్రమతో పాటు ఏ విభాగంలోనైనా రాణించడానికి అవార్డులు దోహదపడతాయని ఆమె పేర్కొన్నారు. సినీ గోయర్స్ స్వర్ణోత్సవ పురస్కారాల వేడుక శుక్రవారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘సమాజంలో అత్యంత ప్రభావవంతమైన వినోదమాధ్యమంగా సినీ పరిశ్రమ కొనసాగుతున్నది. ఆ ఆలోచనను దృష్టిలో పెట్టుకొని దర్శకనిర్మాతలు బాధ్యతాయుతమైన సినిమాల్ని నిర్మించాలి. దక్షిణాది రాష్ర్టాలకు తెలుగు చిత్రసీమ తలమానికంగా కొనసాగడం అభినందనీయం. సంక్షుభిత పరిస్థితులను అధిగమిస్తూ సినీ పరిశ్రమ మరింత పురోగతి సాధించాలి’ అని తెలిపారు. అగ్రనటుడు చిరంజీవి మాట్లాడుతూ ‘సినీ గోయర్స్ సంస్థ 52 ఏళ్లుగా అవార్డులు ఇస్తూ చిత్ర పరిశ్రమలో స్ఫూర్తిని నింపుతుండటం ఆనందంగా ఉంది’ అని చెప్పారు. ఈ వేడుకలో సినీ గోయర్స్ జీవన సాఫల్య పురస్కారాలను సీనియర్ సినీ నటులు రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు స్వీకరించారు. సినీ గోయర్స్ ఐదు దశాబ్దాల అవార్డులను చిరంజీవి, జయప్రద, ప్రకాష్రాజ్తో పాటు దర్శకుడు కె రాఘవేంద్రరావు అందుకున్నారు. 2019 ఏడాదికిగాను ఉత్తమ నాయకానాయికలుగా చిరంజీవి(సైరా నరసింహారెడ్డి), తమన్నా(ఎఫ్-2) అవార్డులు అందుకోగా..2020 ఏడాదిలో అల్లు అర్జున్(అల వైకుంఠపురములో), రష్మిక మందన్న(సరిలేరు నీకెవ్వరు) పురస్కారాలను స్వీకరించారు. ఈ అవార్డుల వేడుకలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, సినీ గోయర్స్ అధ్యక్షప్రధానకార్యదర్శులు పి.శ్రీధర్, బి.రామకృష్ణ పాల్గొన్నారు.