Diljit Dosanjh | ప్రముఖ నటుడు దిల్జీత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో, హనీ ట్రెహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సత్లుజ్’ సినిమాపై నిషేధాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి కమిటీ (IDC) సిఫారసు చేసింది. ఈ సినిమా భారతదేశ సార్వభౌమాధికారానికి, దేశ సమగ్రతకు భంగం కలిగించేలా ఉందనే కారణంతో ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్లలో దీనిపై నిషేధం విధించగా.. ఈ విషయాన్ని కేంద్ర కమిటీ సమర్థించింది. 1984 నుండి 1994 మధ్య పంజాబ్లో జరిగిన వేలాది అనాథ శవాల దహన సంస్కారాలపై పరిశోధన చేసిన మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది.
భద్రతా కారణాల దృష్ట్యా, జూలై 3న జీ5 (ZEE5) ఓటీటీలో విడుదలైన రెండు రోజులకే ఈ సినిమాను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నిలిపివేసింది. అనంతరం ఐటీ నిబంధనలు 2021 ప్రకారం ఏర్పాటు చేసిన అంతర-విభాగ కమిటీ ఈ చిత్రంపై సమగ్ర పరిశీలన జరిపింది. పంజాబ్ ఉగ్రవాద రోజుల్లో భద్రతా దళాలు చేసిన మితిమీరిన చర్యలను మాత్రమే ఈ సినిమాలో చూపిస్తూ, ఉగ్రవాదుల దుశ్చర్యలను కప్పిపుచ్చేలా కథనం సాగిందని, ఇందులో సమతుల్యత లోపించిందని కమిటీ పేర్కొంది. అందుకే ఐటీ చట్టంలోని సెక్షన్ 69A ప్రకారం ఈ సినిమాను బ్లాక్ చేయడం సరైనదేనని స్పష్టం చేసింది. కాగా, ఈ చిత్రంపై నిషేధాన్ని ఎత్తివేయాలని పంజాబ్లోని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) డిమాండ్ చేయగా, శిరోమణి అకాలీదళ్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తామని ప్రకటించడంతో ఈ వివాదం పంజాబ్లో రాజకీయ రంగు పులుముకుంది.