అమరావతి : ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధరల అంశంపై హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రభుత్వ కమిటీ మంగళవారం ఏపీ సచివాలయం రెండో బ్లాక్లో ప్రత్యక్షంగా భేటీ అయ్యింది . హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలోని న్యాయశాఖ కార్యదర్శి , ఐ ఆండ్ పీఆర్ కమిషనర్తో పాటు అధికారులు, సినీరంగ ప్రతినిధులు 13 మంది సమావేశంలో పాల్గొన్నారు. ఇదివరకే వర్చువల్ విధానం ద్వారా సమావేశమై సభ్యుల అభిప్రాయాలను తీసుకున్న కమిటీ ఈసారి నేరుగా సమావేశమై చర్చలు జరుపుతుంది . టికెట్ ధరలపై జేసీలు ఇచ్చిన సిఫార్సులపై కమిటీ చర్చించి న అనంతరం ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు.
పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్రలో ఉన్న టికెట్ ధరలు, ప్రేక్షకులకు కల్పిస్తున్న సౌకర్యాలపై వివరాలు సేకరించిన కమిటీ మరోమారు సమావేశమై సభ్యుల అభిప్రాయాలను తీసుకుంటున్నారు. గత రెండు నెలల క్రితం ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలను తగ్గించడంతో థియేటర్ల నిర్హాహణ కష్టసాధ్యమని సినీ ఎగ్జిబీటర్లు, డిస్ట్రీబూటర్లు పరిశ్రమకు చెందిన ప్రతినిధులు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకుల మేలు కోసం కార్పొరేషన్, మున్సిపల్ , పంచాయతీ ప్రాంతాల వారీగా సినిమా టికెట్ల ధరల తగ్గింపును చట్టబద్ధంగా తీసుకున్న నిర్ణయమేనని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది .