‘మనదేశంలో క్రికెట్ తర్వాత ప్రేక్షకులు కోరుకునే వినోదం సినిమానే. శుక్రవారం ఓ పండగలా అనిపిస్తుంది. అయితే ఏడాదిన్నరగా థియేటర్లో సినిమాను వీక్షించే ఆనందం కరువైంది. మళ్లీ థియేటర్లు కళకళలాడాలి. ఆ రోజులు తప్పకుండా వస్తాయి’ అన్నారు సంపత్నంది. ఆయన దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా నటించిన చిత్రం ‘సీటీమార్’. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. నేడు ప్రేక్షకులముందుకురానుంది. బుధవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. సంపత్నంది మాట్లాడుతూ ‘క్రీడా నేపథ్యంలో వస్తోన్న మాస్ చిత్రమిది. తప్పకుండా అందరి అంచనాల్ని అందుకుంటుందన్న నమ్మకం ఉంది’ అన్నారు. ‘సంపత్నందితో నాకు రెండో సినిమా ఇది. చాలా మనసుపెట్టి చేశాడు. ఏ విషయంలోనూ రాజీపడకుండా నిర్మాతలు ఎంతో గొప్పగా సినిమాను తెరకెక్కించారు. ప్రేక్షకులను ఇంటి నుంచి థియేటర్కు తీసుకొచ్చే సత్తా ఉన్న మాస్ ఎంటర్టైనర్ ఇది’ అని గోపీచంద్ తెలిపారు. సామాజిక స్పృహతో, సమాజం పట్ల బాధ్యతతో సినిమాలు చేస్తున్న గోపీచంద్ అభినందనీయుడని బోయపాటి శ్రీను చెప్పారు.