చాలా రోజుల తర్వాత మళ్లీ వరస సినిమాలతో బిజీ అవుతున్నారు గోపీచంద్. ఈయనకు చాలా కాలంగా సరైన విజయం లేదు. భారీ అంచనాలతో వచ్చిన 25వ సినిమా పంతం కూడా నిరాశ పరిచింది. ఆ తర్వాత చేసిన చాణక్య సినిమా వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు. ఇలాంటి సమయంలో నాలుగు సినిమాలతో వచ్చేస్తున్నాడు గోపీచంద్. ఇప్పటికే ఈయన నటించిన ఆరడుగుల బుల్లెట్ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు సీటీమార్ కూడా విడుదల తేదీని త్వరలోనే ఖరారు చేసుకోనుంది. ఈ చిత్రాన్ని సంపత్ నంది తెరకెక్కిస్తున్నాడు. దాంతో పాటు మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు గోపీ. ఇందులో డబ్బు కోసం ఏదైనా చేసే లాయర్ పాత్రలో నటిస్తున్నాడు గోపీచంద్.
ఇవన్నీ ఇలా ఉండగానే ఇప్పుడు శ్రీవాస్ సినిమాను అనౌన్స్ చేసారు. ఈ సినిమాలో మరో సీనియర్ హీరో కూడా నటించబోతున్నాడని తెలుస్తుంది. ఆయనెవరో కాదు.. రాజశేఖర్. ఈ మధ్య వరస సినిమాలకు కమిట్ అవుతున్నాడు ఈ యాంగ్రీ హీరో. ఈ క్రమంలోనే గోపీచంద్ తోనూ కలిసి నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. టిజి విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే రాజశేఖర్ నటించే విషయంపై మాత్రం ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు.
ఇందులో రాజశేఖర్, గోపీచంద్ అన్నదమ్ములుగా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. హై రేంజ్ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను శ్రీవాస్ తెరకెక్కించనున్నాడు. గతంలో గోపీచంద్ తో ఈయన చేసిన లక్ష్యం, లౌక్యం సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. నిజానికి లౌక్యం తర్వాత గోపిచంద్ కి ఇప్పటివరకు మరో హిట్ లేదు. దాంతో మరోసారి కలిసొచ్చిన దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు ఈ హీరో. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక తర్వాత ఈ మల్టీస్టారర్ సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఇద్దరు యాక్షన్ హీరోలు కలిసి చేయబోయే మల్టీస్టారర్ ఎలా ఉండబోతుందో చూడాలి.