‘ఓటీటీలో సినిమాల్ని విడుదల చేస్తున్న నిర్మాతల్ని తప్పు పట్టలేం. వారు ఆ నిర్ణయం తీసుకోవడం వెనుక వడ్డీలు పెరగడంతో పాటు అనేక కారణాలుంటాయి. నిర్మాతల సమస్యల్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి’ అని అన్నారు గోపీచంద్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘సీటీమార్’. సంపత్నంది దర్శకుడు. శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈ నెల 10న విడుదలకానుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో గోపీచంద్ పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి…
క్రీడా నేపథ్య కథాంశంతో నేను చేసిన తొలి సినిమా ఇది. ఇందులో ఏపీ మహిళా కబడ్డీ టీమ్ కోచ్గా కనిపిస్తా. ఓ లక్ష్యం కోసం పోరాడే అతడికి ఎలాంటి అవరోధాలు ఎదురయ్యాయి?తమ టీమ్ను ఎలా విజేతగా నిలిపాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది. మహిళా క్రీడాకారిణులకు సమాజంలో ఎదురయ్యే వివక్షను అర్థవంతంగా సినిమాలో చూపించబోతున్నాం. మహిళా సాధికారతకు కమర్షియల్ హంగుల్ని మేళవిస్తూ దర్శకుడు సంపత్నంది అద్భుతంగా కథను సిద్ధం చేశారు. అంతర్లీనంగా వచ్చే సిస్టర్ సెంటిమెంట్ మనసుల్ని హత్తుకుంటుంది. మహిళా క్రీడాకారిణులను సమాజం చూసే ధోరణిలో తప్పుందని, ఆ విధానంలో మార్పు రావాలనే పాయింట్ను ఆసక్తికరంగా సంపత్నంది సినిమాలో చూపించారు.
కొత్తగా చూపించాం…
చక్దే ఇండియా, బిగిల్తో పాటు క్రీడా నేపథ్య కథాంశాలతో వివిధ భాషల్లో చాలా సినిమాలొచ్చాయి. వాటిని చూసి స్ఫూర్తి పొందడంలో తప్పులేదు. కానీ వాటికి భిన్నంగా కొత్త అంశాలతో సినిమాను తెరకెక్కించినప్పుడే విజయాల్ని అందుకోగలుగుతాం. ఈ సినిమాలో అదే పంథాను అనుసరించాం. పాత్రచిత్రణలతో పాటు కథాగమనం, యాక్షన్ అంశాలు చాలా కొత్తగా ఉంటాయి. మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ వర్గాల్ని ఆకట్టుకుంటుంది.
నిజమైన ప్లేయర్స్ నటించారు..
ఈ సినిమాలో నిజమైన కబడ్డీ ప్లేయర్స్ నలుగురు నటించారు. జీవితంలో స్థిరపడాలనే సంకల్పంతో కబడ్డీ క్రీడను ఎంచుకున్న వారు తమకు ఎదురైన కష్టాల్ని గురించి షూటింగ్ సమయంలో మాతో పంచుకున్నారు. అవన్నీ వినగానే ఎమోషనల్ అయ్యాను. వారు పడే కష్టంతో పోలిస్తే సినిమాల కోసం నేను చేసే శ్రమ తక్కువే అనిపించింది. తెలంగాణ మహిళా కబడ్డీ టీమ్ కోచ్గా తమన్నా పాత్ర శక్తివంతంగా సాగుతుంది.
కరోనా వల్ల వాయిదా..
‘గౌతమ్నందా’ విషయంలో నేను అనుకున్న ఫలితం రాలేదు. కథ విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయి. వాటిని ఈ సినిమాలో పునరావృతం చేయకుండా జాగ్రత్తపడ్డాం. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండానే సంపత్నంది ప్రతిభపై నమ్మకంతో అతడితో మరో సినిమా చేశా. 2019 డిసెంబర్లో సినిమా ప్రారంభించాం. 2020లో విడుదలకావాల్సింది. కరోనా వల్ల కుదరలేదు. థియేటర్స్ పరంగా సమస్యలున్నా ఎప్పటికైనా సినిమాను విడుదలచేయాల్సిందేననే ఆలోచనతోనే వినాయకచవితికి ప్రేక్షకుల ముందుకొస్తున్నాం. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తున్నా. అలాగే శ్రీవాస్తో మరో సినిమా ఉంటుంది. తేజతో సినిమా చేయాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల అది వర్కవుట్ కాలేదు.