హీరో టి.గోపీచంద్ కథానాయకుడిగా 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫైట్ మాస్టర్ వి.వెంకట్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. మలయాళ నటి అనార్కలి నాజర్ కథానాయిక. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి యాక్షన్ కొరియోగ్రాఫర్లు రామ్-లక్ష్మణ్ కెమెరా స్విచాన్ చేయగా, అగ్ర నిర్మాత శ్యామ్ప్రసాద్రెడ్డి క్లాప్ కొట్టారు. మరో అగ్ర నిర్మాత దిల్రాజు గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు కేఎల్ దామోదరప్రసాద్, మైత్రీ రవిశంకర్ స్క్రిప్ట్ని మేకర్స్కి అందించారు.
అతిథులంతా చిత్రం బాగా రావాలంటూ ఆకాంక్షించారు. గోపీచంద్ కెరీర్లో ఇది 34వ చిత్రమని, అత్యున్నత నిర్మాణ విలువలతో, సాంకేతిక నైపుణ్యంతో కూడిన సరికొత్త కథను ప్రేక్షకులకు అందించనున్నామని, దర్శకుడు వి.వెంకట్ బలమైన స్క్రిప్ట్ని సిద్ధం చేశారని, గోపీచంద్ పూర్తి యాక్షన్ అవతారంలో కనిపిస్తారని, ఇంటెన్స్ డ్రామా, ఎమోషన్స్తో ఆయన పాత్ర సాగుతుందని, రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానున్నదని మేకర్స్ తెలిపారు. ఈచిత్రానికి కెమెరా: షామ్దత్, సంగీతం: సామ్ సీఎస్, ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్.