కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి 100 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ కర్ణాటకలో ఆయన్ని మరిచిపోలేకపోతున్నారు అభిమానులు. ఈ రోజుకు కూడా కంఠీరవ స్టేడియంకు వేల సంఖ్యలో అభిమానులు పునీత్ దర్శనం కోసం వస్తున్నారు అంటే ఆయన స్థాయి మనిషి నుంచి దేవుడిగా మారింది అని అర్థం చేసుకోవాల్సిందే. ఆయన మరణం తట్టుకోలేక దాదాపు 20 మందికిపైగా అభిమానులు చనిపోయారు. పైగా కన్నడ ఇండస్ట్రీలో ఈయన స్థాయి దాదాపు 100 కోట్లు దాటిపోయింది.
పునీత్ చేసే ఒక సినిమా బడ్జెట్ 40 నుంచి 50 కోట్ల మధ్యలో ఉంటుంది. దానికి తోడు ఈయన అగ్ర హీరో కావడంతో ఎప్పుడూ మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉండేవాడు. చనిపోయే సమయంలో కూడా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి జేమ్స్ రెండోది ద్విత్వ. ఇందులో జేమ్స్ షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఇందులో బాడీ బిల్డర్ గా నటించాడు పునీత్. నిజానికి ఈ సినిమా కోసమే కొన్ని రోజులుగా కష్టపడ్డాడు ఈయన. గంటలు గంటలు జిమ్ లో వర్కవుట్స్ చేసాడు. ఈ సమయంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయాడు.
జేమ్స్ సినిమా బడ్జెట్ దాదాపు 60 కోట్లు. ఈ సినిమాను చేతన్ కుమార్ తెరకెక్కిస్తున్నాడు. పునీత్ చనిపోయే ముందే ఈ సినిమా 90 శాతం పూర్తయింది. కేవలం క్లైమాక్స్ మాత్రమే బాకీ ఉంది. దాన్ని కూడా పూర్తి చేసారు మేకర్స్. పునీత్ మరణించడంతో జేమ్స్ సినిమాలో ఆయన డబ్బింగ్ అన్నయ్య శివరాజ్ కుమార్ చెప్పాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా మొదటి లిరికల్ వీడియో విడుదల కానుంది. మార్చ్ 1 ఉదయం 11.11 గంటలకు జేమ్స్ టైటిల్ సాంగ్ విడుదల కానుంది. టాలీవుడ్ హీరో శ్రీకాంత్ ఇందులో విలన్ గా నటించడం విశేషం. సినిమాను మార్చి 17న పునీత్ రాజ్ కుమార్ జయంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కేవలం కన్నడలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా ఈ సినిమా విడుదల కానుంది.