Jana nayagan | తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జననాయగన్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది. సెన్సార్ వివాదాల కారణంగా గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఎట్టకేలకు సెన్సార్ పూర్తి చేసుకోవడంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే విజయ్ సినిమా వస్తుండటంతో పలు సినిమాలు ఇప్పటికే వాయిదా పడుతున్నాయి. కొన్ని చిత్రాలు తమ విడుదల తేదీలను మార్చుకుంటున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ కూడా తన తండ్రి సినిమా కోసం వెనక్కి తగ్గినట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న హై-వోల్టేజ్ హీస్ట్ ఎంటర్టైనర్ చిత్రం ‘సిగ్మా’. సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను నిజానికి జూలై 31న విడుదల చేయడానికి చిత్రబృందం ప్లాన్ చేసింది. కానీ, జూలై చివరిలో ‘జననాయగన్’ రాబోతుండటం వలన.. క్రేజ్, కలెక్షన్లపై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతోనే ‘సిగ్మా’ విడుదలను వాయిదా వేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. తండ్రి సినిమాకు లైన్ క్లియర్ చేస్తూ కుమారుడు తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ‘సిగ్మా’ చిత్రాన్ని ఆగస్టు నెలకు వాయిదా వేసినట్లు సమాచారం. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు వస్తున్న చివరి సినిమా కావడంతో కోలీవుడ్లో ‘జననాయగన్’ మేనియా ఓ రేంజ్లో నడుస్తోంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ వాయిదాపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.