ఏ తరహా సినిమాలు చేసినా అర్థవంతమైన కథలకే తన ప్రాధాన్యత అని చెప్పారు యువహీరో శివ కందుకూరి. ‘చూసి చూడంగానే’ ‘గమనం’ వంటి చిత్రాల ద్వారా ప్రతిభావంతుడైన నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నారాయన. ప్రస్తుతం ‘మను చరిత్ర’ చిత్రంలో నటిస్తున్నారు. నేడు శివ కందుకూరి జన్మదినం. ఈ సందర్భంగా నటుడిగా తన భవిష్యత్తు ప్రణాళికల్ని పాత్రికే యులతో పంచుకున్నారు. ఆ సంగతులివి.
నేను ఎంచుకునే కథలో ఏదో ఒక ప్రయోజనం, పరమార్థం ఉండాలి. ఫక్తు కమర్షియల్ పంథాలో సినిమాలు చేయడం నాకు ఇష్టం ఉండదు. ఒక పాత్ర తాలూకు సంఘర్షణతో సహానుభూతి చెందినప్పుడే దానికి పరిపూర్ణంగా న్యాయం చేయగలనని నమ్ముతాను. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ తన పాత్రను అమితంగా ప్రేమించాడు కాబట్టే ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నాడు. ‘గమనం’ ‘చూసి చూడంగానే’ సినిమాల్లో నా పాత్రకు మంచి పేరొచ్చింది. ముఖ్యంగా ‘గమనం’ చిత్రంలో చారుహాసన్, శ్రియ వంటి సీనియర్ నటులతో కలిసి పనిచేయడం గొప్ప అనుభూతినిచ్చింది.
కమర్షియల్ సినిమాలు చేసినా..
ఒకవేళ కమర్షియల్ కథల్ని ఎంచుకున్నా వాటిలో కొత్తదనం ఉండేలా చూసుకుంటా. ‘మనుచరిత్ర’ సినిమాలో నాలోని మాస్ కోణాల్ని చూస్తారు. అందులో నా క్యారెక్టరైజేషన్ ఇప్పటివరకు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఏ జోనర్ సినిమాలు చేసినా కంటెంట్లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తప్పకుండా ఉండాలని కోరుకుంటా. రాశి కంటే వాసికే ప్రాధాన్యతనివ్వాలన్నది నా సిద్ధాంతం.
పంథా మారుతున్నది..
ప్రస్తుతం ఓటీటీ ప్రభావంతో ప్రేక్షకులు ప్రపంచ సినిమాల్ని వీక్షిస్తున్నారు. వారి అభిరుచుల్లో కూడా మార్పు వస్తున్నది. తదనుగుణంగా నటీనటులు కూడా పాత్రల్లో వైవిధ్యాన్ని ప్రదర్శించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నేను నటిస్తున్న ‘మను చరిత్ర’ షూటింగ్ పూర్తిచేసుకుంది. హీరో నాని నిర్మాణంలో ‘మీట్ క్యూట్’అనే వెబ్మూవీలో నటిస్తున్నా. వీటితో పాటు నూతన దర్శకుడు పురుషోత్తంరాజ్తో ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నా.