దర్శకుడు జేమ్స్ కామెరూన్ రూపొందించిన విజువల్ వండర్ ‘అవతార్ ద వే ఆఫ్ వాటర్’ విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో కేట్ విన్స్లెట్, సామ్ వార్తింగ్టన్, జోయో సల్డానా, సిగుర్నే వీవర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇందులో గత సినిమాకు మించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. నీటి అడుగున జీవిస్తున్న పండోరా గ్రహవాసులపై మనుషులు ఆధునిక ఆయుధాలతో దాడులు చేయడం, వాటిని స్థానికులు ఎదుర్కోవడం ఆసక్తికరంగా తెరకెక్కించారు. నీటి అడుగున సన్నివేశాల చిత్రీకరణ కోసం రెండున్నర లక్షల గ్యాలన్ల నీటిని నిల్వచేసే భారీ ట్యాంక్ను ఆమెరికాలోని మాన్హాట్టన్ బీచ్ స్టూడియోలో నిర్మించారు.
ఇందులో నీటి అడుగున సహజత్వం ఉట్టిపడేలా సన్నివేశాలను చిత్రీకరించారు. దీని గురించి దర్శకుడు జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ…‘సినిమా రూపకల్పనకు ఎంత సాంకేతికత ఉపయోగించినా పాత్రల మోషన్ (కదలికలు), ఎమోషన్ (భావోద్వేగాలు) ఒరిజినల్గా చూపించాలి. అందుకే భారీ ట్యాంక్లో చిత్రీకరణ జరిపాం’ అని చెప్పారు. దాదాపు 2 వేల కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా కోసం సినీ ప్రియులు వేచి చూస్తున్నారు. ఈ నెల 16న ఈ సినిమా విడుదలవుతున్నది.