Gaddar Awards | అప్పట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు ఇస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆ ముచ్చటే లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ సినిమా అవార్డుల ఫంక్షన్ ని నభూతో న భవిష్యత్తు అన్నట్టు జరుపుతామని చెప్పుకొచ్చింది. నేడు గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డుల మీడియా సమావేశం జరగగా, ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు, జ్యూరీ ఛైర్మన్ జయసుధ.. పలువురు పాల్గొన్నారు.
హెచ్ఐసీసీ వేదిగా జూన్ 14న తెలంగాణలో గద్దర్ సినీ అవార్డులు ప్రదానోత్సం చేస్తామని దిల్ రాజు అన్నారు. ప్రపంచ స్థాయిలో సినిమా అవార్డుల ఫంక్షన్ ఏ తీరుగా నిర్వహిస్తారో అందుకు ఏమాత్రం తగ్గకుండా గద్దర్ అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది. ఈ అవార్డ్ వేడుక గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా ఈవెంట్ నిర్వహించాలని కమిటీ సభ్యులకి, అధికారులకి భట్టి విక్రమార్క సూచించారు. సినిమా అవార్డుల ఫంక్షన్ కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు . తెలంగాణ రాష్ట్రంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ పుట్టడం మన అదృష్టం అని, దశాబ్దానికి ఒకరు అలాంటి మహానుభావులు పుడతారని కొనియాడారు భట్టి విక్రమార్క.
గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులు ప్రవేశపెట్టడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. తన గళంతో తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసిన ఆయన మన తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం మన అదృష్టం. తెలంగాణ ఉద్యమానికి ఆయన ఊపిరి పోశారు కాబట్టి ఆయన పేరు మీద అవార్డులు ఇవ్వడం సముచిత నిర్ణయమే. బంధాలు, రాగద్వేషాలకు అతీతంగా గద్దర్ సినీ అవార్డులకు సినిమాలను ఎంపిక చేయాలని జూరీ సభ్యులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. . త్వరలోనే సీఎం చేతుల మీదుగా గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల లోగో ఆవిష్కరణ చేయనున్నారు. ఇక గద్దర్ సినీ పురస్కారాల ఎంపిక కోసం 15 మంది సభ్యులతో జ్యూరీ ఏర్పాటు కాగా, కమిటీకి ఛైర్మన్గా నటి జయసుధను ఎంపిక చేశారు. అవార్డుల కోసం అన్ని విభాగాల్లో 1248 నామినేషన్లు రాగా, వ్యక్తిగత విభాగంలో 1172, ఫీచర్ ఫిల్మ్, డాక్యుమెంటరీ, ఫిల్మ్ క్రిటిక్స్, చిల్డ్రన్ ఫిల్మ్స్, పుస్తకాలు ఇతర కేటగిరిల్లో 76 దరఖాస్తులు అందినట్టు తెలియజేశారు.