Free Movies on Ott Plat Forms | ప్రస్తుతం ఓటీటీలు రాజ్యమేలుతున్నాయన్నది వాస్తవం. వందలు పెట్టి థియేటర్లో ఒక్కరు సినిమా చూసే కంటే అదే పైకం చెల్లించి ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకుని కుటుంబమంతా కలిసి సినిమాలు చూడోచ్చు అనే ధోరణిలో జనాలు ఆలోచిస్తున్నారు. ఒకప్పుడు కనీసం వీకెండ్ అయినా.. ఫ్యామిలీ అంతా కలిసి సినిమా హాల్లకు వచ్చేవారు. కానీ ఇప్పుడు చాలా మంది థియేటర్లను స్కిప్ చేస్తున్నారు. దానికి తగ్గట్లు కొత్త సినిమాలు కూడా రెండు, మూడు వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కొత్త కొత్త సినిమాలను రిలీజ్ చేస్తూ.. టెంప్ట్ చేసే ఆఫర్లను ప్రకటిస్తూ జనాలను అట్రాక్ట్ చేస్తున్నారు. కాగా తాజాగా పలు ఓటీటీ సంస్థలు సమ్మర్ వినోదాల పేరుతో జనాలను ఆకర్షించే పనిగా పెట్టుకుని ఉచితంగా సినిమాలు చూసే వెసలుబాటును కల్పిస్తున్నాయి. రూపాయి డబ్బు చెల్లించకుండా కొత్త సినిమాలను ఫ్రీగా చూడండి అంటూ ఓటీటీ ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఏయే ఓటీటీ సంస్థలు ఫ్రీగా సినిమాలు చూపిస్తున్నాయో ఓ లుక్కేద్దాం.
ఆహా:
మూడేళ్ల కిందట అల్లు అరవింద్ ఈ ఓటీటీ ప్లాట్ఫార్మ్ను స్థాపించాడు. వారానికో సినిమాను మీ ముందు ఉంచుతాం అంటూ భారీ రేంజ్లో ప్రచారం జరిపారు. దానికి తగ్గట్లు అందరికి అందుబాటులో ఉంచే రేటునే నిర్ణయించారు. దాంతో ఏడాదిలోనే లక్షల్లో సబ్స్రైబర్లు వచ్చి పడ్డారు. ఇక తొలి రోజుల్లో చెప్పినట్లుగానే వారానికో సినిమాను దింపారు. కానీ ఇప్పుడు రెండు వారాలకు ఒక్క సినిమా కూడా రావడం లేదు. కాగా ఇప్పుడు సమ్మర్లో ప్రేక్షకులకు ఉచితంగా వినోదాన్ని పంచే ప్రక్రియను స్టార్ట్ చేసింది. సమ్మర్ బాక్సాఫీస్ పేరుతో రోజుకో సినిమాను ఫ్రీగా చూసే వెసులుబాటును కల్పిస్తుంది. ఇప్పటికే క్రాక్, మసూద, కలర్ఫోటో, నాంది వంటి సినిమాలను ఫ్రీగా స్ట్రీమింగ్ చేసింది. ఈ రెండు రోజుల్లో అన్స్టాపబుల్ ఎపిసోడ్లను ఉచితంగా స్ట్రీమింగ్ చేయనుంది.
జియో సినిమా:
ఐపీఎల్ను ఫ్రీగా అందిస్తున్న జియో సినిమా కొన్ని సినిమాలను ఫ్రీగా అందిస్తుంది. అది కూడా కొత్తగా స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న భేదియా సినిమా నిన్నటి నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ అవుతుంది అది కూడా ఉచితంగా. విక్రమ్ వేద, కచ్చేయ్ లింబూ, థగ్స్ వంటి పలు సినిమాలు జియో సినిమా ఆప్లో ఉచితంగా చూడొచ్చు. ఇక రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన భూ సినిమా సైతం నేరుగా జియో సినిమాలో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మధ్య జియో సినిమా మంచి దూకుడు చూపిస్తుంది. ఎలాంటి రుసుము కట్టకుండానే చాలా కంటెంట్ను ఉచితంగా అందిస్తుంది. హెచ్బీఓ సరుకు మట్టుకు డబ్బులు చెల్లించి చూడాల్సి ఉంటుంది.
జీ-5:
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు, వెబ్ సిరీస్లను ప్రేక్షకులు ముందుంచే జీ-5 సైతం ఉచితంగా సినిమాలు అందించడానికి రెడీ అయింది. అయితే జీ-5 కేవలం 15 నిమిషాలు మాత్రమే సినిమాలను ఫ్రీగా చూసే కిటుక్కు పెట్టింది. కళ్యాణ్రామ్ నటించిన బింబిసార సినిమాను పదిహేను నిమిషాలు ఉచితంగా చూసే వెసులుబాటు కల్పించింది. అయితే సినిమా మొత్తం చూడాలంటే సబ్స్రిప్షన్ తీసుకోవాల్సిందే.
ఇలా సినిమాలను ఉచితంగా చూపిస్తే కాస్తో కూస్తో థియేటర్లో సినిమాలు చూస్తున్న వారి సంఖ్య కూడా తగ్గే అవకాశాలు లేకపోలేదు. ఇక ఇదే పరిస్థితి కొనసాగితే డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు ఈగలు దులుపుకోవడం తప్ప ఏది ఉండదని, వారి పొట్ట కొట్టకండి అంటూ పలువురు నెటిజన్లు వాళ్ల అభిప్రాయాలు తెలుపుతున్నారు. అయినా టీవీల్లో చూసే సినిమాకు థియేటర్లో ఎక్స్పీరియెన్స్ చేసే సినిమాలకు లెక్క లేనంత తేడా ఉంటుంది. ఎంతైనా థియేటర్లో సినిమాలు చూస్తే వచ్చే మజానే వేరు.