మహేష్బాబు-రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రానికి సంబంధించిన భారీ ఈవెంట్ ఈ నెల 15న హైదరాబాద్లో జరగబోతున్న విషయం తెలిసిందే. ఇదే వేదికపై దర్శకుడు రాజమౌళి సినిమా టైటిల్తో పాటు ఫస్ట్గ్లింప్స్ను విడుదల చేస్తారని ప్రచారం జరుగుతున్నది. ఈవెంట్కు ముందుగానే దర్శకధీరుడు ఈ సినిమాకు సంబంధించి సర్ప్రైజ్ అప్డేట్ను పంచుకున్నారు. ఇందులో మలయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.
శుక్రవారం కుంభ అనే పాత్రలో ఆయన ఫస్ట్లుక్ను విడుదల చేశారు. హైటెక్ వీల్చైర్లో కూర్చొని న్యూఏజ్ విలన్గా ఆయన లుక్ ఆకట్టుకుంటున్నది. ‘క్రూరమైన, శక్తివంతమైన విలన్ కుంభను మీకు పరిచయం చేస్తున్నాం. ఈ లుక్ నాకు క్రియేటివ్గా ఎంతో సంతృప్తినిచ్చింది’ అని రాజమౌళి సోషల్మీడియాలో పేర్కొన్నారు. ‘ఎస్ఎస్ఎంబీ29’ వర్కింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ‘గ్లోబల్ ట్రాటర్’ (ప్రపంచ యాత్రికుడు) అనే హ్యాష్ట్యాగ్తో రాజమౌళి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. భారతీయ పురాణాలతో ముడిపడిన ఈ కథలో హీరో మహేష్బాబు ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసయాత్రికుడి పాత్రలో కనిపిస్తారని, అటవీ నేపథ్యంలో హైఇంటెన్సిటీ అడ్వెంచరస్ మూవీగా మెప్పిస్తుందని అంటున్నారు.