AP Movie Tickets | ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సినీ ప్రముఖులు వచ్చి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలుస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో ఇంకా ఎవరికీ క్లారిటీ రాలేదు. మరోవైపు జగన్ కూడా ఈ విషయంపై కాస్త సీరియస్ గానే ఉన్నాడు. తగ్గించిన టికెట్ రేట్లు మళ్లీ పెంచాల్సిన అవసరం ఉందా లేదా అని తెలుసుకోవడానికి కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఇప్పుడు ఈ కమిటీకి సంబంధించిన పూర్తి నివేదిక ఇచ్చే సమయం దగ్గరికి వచ్చింది. ఫిబ్రవరి 17 ఉదయం ఏపీ ప్రభుత్వం దగ్గరికి కమిటీ వెళ్లనుంది. ఇన్ని రోజులుగా సినిమా టికెట్ రేట్లు సంబంధించిన వ్యవహారం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. కమిటీ ఏం చెప్తే ప్రభుత్వం కూడా అదే నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తోంది.
టికెట్ రేట్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం ఫిబ్రవరి 17న ఉదయం వెలగపూడిలోని సచివాలయంలో 11.30 నిమిషాలకు జరగనుంది. అనంతరం కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ కమిటీ ఇచ్చిన నివేదికపై ఏపీలో సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. అందులో వాళ్లేం సూచిస్తారో.. దాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఒకవేళ సినిమా టికెట్ రేట్లు పెరిగితే మాత్రం ఫిబ్రవరి 25న విడుదల కాబోయే భీమ్లా నాయక్ సినిమాకు బాగా హెల్ప్ కానుంది. ఆ తర్వాత కూడా వరుణ్ తేజ్ గని, ఆడవాళ్లు మీకు జోహార్లు, రాధే శ్యామ్, ఆచార్య లాంటి సినిమాలు రానున్నాయి.