Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ఈరోజు సాయంత్రం తెలుగు సినీ నిర్మాతల ప్రతినిధి బృందం అత్యవసరంగా భేటీ కానుంది. ప్రస్తుతం అధికారిక పర్యటన నిమిత్తం రాజమండ్రిలో ఉన్న పవన్ కళ్యాణ్ను నిర్మాతలు అక్కడ కలిసి చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించనున్నారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా తెలుగు చిత్ర పరిశ్రమలో థియేటర్ల యజమానులకు, గిల్డ్ నిర్మాతలకు నడుస్తున్న అంతర్గత వివాదాలు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రెంట్ బేస్ కాకుండా మొదటి రోజు నుంచే వర్తించాల్సిన ‘పర్సంటేజ్ విధానం’ వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ సాగనుంది.
ఈ వివాదంపై నిన్ననే ఎగ్జిబిటర్ల ప్రతినిధి బృందం హైదరాబాద్లో మెగాస్టార్ చిరంజీవితో ప్రత్యేకంగా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు నిర్మాతల మండలి ప్రతినిధులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి, థియేటర్ల వ్యవస్థ బలోపేతానికి సంబంధించిన ఒక అధికారిక వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. ప్రభుత్వ పరంగా ఎగ్జిబిటర్లు, నిర్మాతల సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించేలా చొరవ చూపాలని వారు కోరనున్నారు. ఈ కీలక భేటీ తర్వాత టాలీవుడ్ థియేటర్ల వివాదానికి ఒక స్పష్టమైన ముగింపు దొరుకుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.