MOVIE MAKERS | తెలుగు సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికులకు శుభవార్త అందింది. వేతనాల పెంపుపై గత కొన్నాళ్లుగా సాగుతున్న చర్చలు చివరకు ఫలితాన్నిచ్చాయి. ఫిల్మ్ ఛాంబర్ తాజాగా ఒక కీలక ప్రకటన విడుదల చేస్తూ, కార్మికుల వేతనాలను 22.5 శాతం వరకు పెంచుతున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ నిర్ణయం సినిమారంగంలోని సుమారు 13 కార్మిక సంఘాలతో ఆగస్టు 22న కార్మికశాఖ సమక్షంలో కుదిరిన ఒప్పందానికి అనుగుణంగా తీసుకున్నది. ఈ ఒప్పందం ప్రకారం ఆగస్టు 22, 2025 వరకు 15% పెంపు అమలులో ఉంటుంది. మిగతా 7.5% పెంపు తదుపరి దశల్లో, ఉమ్మడిగా మూడు విడతలుగా అమలు చేయనున్నారు.
రోజుకు రూ.2,000 కన్నా తక్కువ సంపాదన కలిగిన కార్మికులకు ఈ పెంపు వర్తిస్తుంది.మొదటి ఏడాది 15%, రెండో, మూడో సంవత్సరాల్లో ఒక్కోసారి 5 శాతం చొప్పున పెరుగుతుందని ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ తెలిపారు. జూనియర్ ఆర్టిస్టుల వర్గీకరణ ప్రకారం ‘ఏ’ కేటగిరీకి రూ.1,420, ‘బి’ కేటగిరీకి రూ.1,175, ‘సి’ కేటగిరీకి రూ.930 ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఉదయం సమయంలో అల్పాహారం అందించని పరిస్థితి ఉంటే అదనంగా రూ.70, మధ్యాహ్నం భోజనం ఇవ్వనప్పుడు రూ.100 చెల్లించాలని నిబంధన అమలు చేయనున్నారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు కాల్షీట్కు రూ.1,470, హాఫ్ కాల్షీట్కు రూ.735గా వేతనం నిర్ణయించారు. 4 గంటల పని సమయం దాటితేనే పూర్తి వేతనం చెల్లించాల్సి ఉంటుందని ఫిల్మ్ ఛాంబర్ స్పష్టం చేసింది.
వేతనాల అమలులో తలెత్తే సమస్యలను పరిశీలించేందుకు తెలంగాణ ప్రభుత్వం అతి త్వరలోనే ప్రత్యేక కమిటినీ ఏర్పాటు చేయనుంది. అప్పటివరకు, ఆగస్టు 21న కార్మిక శాఖ తయారుచేసిన మినిట్స్ ప్రకారం మార్గదర్శకాలను పాటించాలని నిర్మాతలకు సూచించారు. అలాగే, ఇతర పనివేళల పద్ధతులు, అలవెన్సులు వంటివి 2022లో కుదిరిన ఒప్పందం ప్రకారమే కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఫిల్మ్ ఛాంబర్ ప్రకటించిన షరతులను ఫెడరేషన్ నేతలు తిరస్కరించారు.13 కార్మిక సంఘాల వేతనాల పెంపును సమానంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.చిన్న సినిమాలకు పాత వేతనాలు కొనసాగించడం తగదని పేర్కొన్నారు. అయితే నిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఫెడరేషన్ నేతలు తిరస్కరించారు. నిర్మాతలు విధించిన షరతులు అంగీకారయోగ్యం కావని, 13 సంఘాలకు సమానంగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. యూనియన్ల ఐక్యతను దెబ్బతీసేలా నిర్మాతల చర్యలు ఉన్నాయంటూ వారు ఆరోపిస్తున్నారు.