ముంబై: నటుడు ఫర్దీన్ ఖాన్, ఆయన భార్య నటషా మాధవి మధ్య విభేదాలు పొడసూపాయి. దాంతో ఆ ఇద్దరి 18 ఏండ్ల కాపురానికి ఎండ్ కార్డ్ పడబోతున్నది. విభేదాల కారణంగా వాళ్లిద్దరూ విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఫర్దీన్ ఖాన్, నటషా ఇద్దరూ 2005లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
ఆ తర్వాత దాదాపు 15 ఏళ్లపాటు వారి కాపురం సజావుగానే సాగింది.
ఈ క్రమంలో 2013లో వారికి బిడ్డ డయానీ, 2017లో కొడుకు అజారియస్ జన్మించారు. 2020 తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ ఏడాది కాలంగా ఫర్దీన్, నటషా విడివిడిగా ఉంటున్నారు. ఫర్దీన్ తన తల్లి కలిసి ముంబైలో ఉంటుండగా, నటషా తన పిల్లలతో కలిసి లండన్లో నివసిస్తున్నది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు వాళ్లిద్దరూ విడాకులకు కూడా సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతున్నది. ఇద్దరూ ఇక కలిసి ఉండటం కుదరదని నిర్ణయించుకోవాలని విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది. అయితే, వారి మధ్య విభేదాలకు కారణం ఏమిటన్నది మాత్రం స్పష్టంగా తెలియరాలేదు.