అనారోగ్యంతో శనివారం కన్నుమూసిన ప్రముఖ నటుడు తారకరత్నకు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం తారకరత్న భౌతికకాయాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్ మోకిళ్లలోని ఆయన స్వగృహానికి తరలించారు. చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, చంద్రబాబు నాయుడు, లోకేష్, బ్రహ్మణి, నటులు రాజేంద్రప్రసాద్, అలీ, మురళీ మోహన్, అజయ్ తదితరులు తారకరత్నకు నివాళులు అర్పించారు.
తారకరత్న కోలుకుంటాడని, ఆరోగ్యంగా తిరిగి వస్తాడని ఆశించామని, చిన్న వయసులోనే ఆయన కన్నుమూయడం బాధాకరం అని వారు సంతాపం తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తారకరత్న మృతికి సంతాపాన్ని తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సోమవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4వరకు అభిమానుల సందర్శనార్థం ఫిలింఛాంబర్లో తారకరత్న పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. అక్కడి నుంచి ఆయన అంతిమయాత్ర సాగనుంది. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.