సాహసం తన పథం అంటున్నది అగ్ర కథానాయిక సమంత. వెండివెన్నెల జడిలా దట్టంగా పరచుకున్న స్విట్జర్లాండ్ హిమశిఖరాలపై ఈ అమ్మడు అడ్వెంచరస్ స్పోర్ట్స్ స్కీయింగ్ను ఆస్వాదిస్తున్నది. పట్టు తప్పకుండా మంచుపర్వతాలపై జారిపోవడం గొప్ప అనుభూతినిస్తున్నదని సమంత చెప్పింది. అయితే ఈ క్రీడలో శిక్షణ కోసం ఎంతగానో శ్రమించానని పేర్కొంది. ‘తొలుత తక్కువ లోతు వున్న పర్వతపు వాలులో స్కీయింగ్ను ప్రాక్టీస్ చేశా. చిన్న పిల్లలు కూడా నాతో పాటు పాల్గొన్నారు. సాధన సమయంలో వందసార్లు క్రిందపడి లేచాను. అయినా ఎప్పుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ప్రస్తుతం ఎత్తైన పర్వత సానువుల మీద నుంచి కూడా ధైర్యంగా స్కీయింగ్ చేయగలుగుతున్నా’ అని సమంత ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఆమె తెలుగులో నటిస్తున్న ‘శాకుంతలం’ చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ఇందులో ఆమె పౌరాణిక కావ్యనాయిక శకుంతల పాత్రను పోషిస్తున్నది. పాన్ ఇండియా చిత్రం ‘యశోద’ త్వరలో సెట్స్మీదకు వెళ్లనుంది.