“ఎఫ్-3’ చిత్రం రెండున్నర గంటల పాటు కడుపుబ్బా నవ్విస్తుంది. సెన్సార్ వారు సినిమా చూసి హ్యాపీగా ఫీలయ్యారు. ప్రేక్షకులకు ఫుల్మీల్స్గా అద్భుతమైన వినోదాన్ని పంచే చిత్రమిది’ అన్నారు ప్రముఖ నిర్మాత దిల్రాజు. ఆయన సమర్పణలో వెంకటేష్, వరుణ్తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఎఫ్-3’. శిరీష్ నిర్మాత. ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది.
శనివారం హైదరాబాద్లో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా దిల్రాజు మాట్లాడుతూ ‘ఈ సినిమాకు వెంకటేష్, వరుణ్తేజ్ వంటి గొప్ప కమిట్మెంట్ ఉన్న హీరోలు దొరికారు. రాజేంద్రప్రసాద్, అలీ, సునీల్తో పాటు తారాగణమంతా చక్కటి వినోదాన్ని అందిస్తారు. దేవిశీప్రసాద్తో మా సంస్థ విజయపరంపర కొనసాగుతూనే ఉంది. ఈ సినిమాకు కూడా అద్భుతమైన సంగీతాన్నందించాడు’ అని అన్నారు.
‘దిల్రాజుగారిని నేను కేవలం నిర్మాతగానే చూడను. ఆయన కుటుంబంలో భాగమనుకుంటా. మా కాంబినేషన్లో సినిమాలు వస్తూనే ఉంటాయి. వరుణ్తేజ్ నాకు సోదరుడిలాంటి వారు. ఇందులో ఆయన్ని కొత్త కోణంలో చూస్తారు. వెంకటేష్ నా ఆల్టైమ్ ఫేవరేట్ హీరో. ఆయన కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు’ అని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పారు.
వెంకటేష్ మాట్లాడుతూ ‘మూడేళ్ల విరామం తర్వాత ‘ఎఫ్-3’ ద్వారా మీ అందరిని థియేటర్లలో కలుసుకోవడం ఆనందంగా ఉంది. దిల్రాజుతో పనిచేయడం ఎప్పుడూ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఈ ఈవెంట్ మాదిరిగానే ‘ఎఫ్-3’ కూడా అదిరిపోతుంది’ అన్నారు. ‘దిల్రాజుగారి సంస్థను నా హోమ్ ప్రొడక్షన్స్లా ఫీలవుతా. ‘ఫిదా’ ‘ఎఫ్-2’ తర్వాత ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడం ఖాయం. నేటితరం దర్శకుల్లో అనిల్ రావిపూడి స్థాయి హాస్యాన్ని ఎవరూ పండించలేరు. వెంకటేష్గారితో రెండో సినిమా చేయడం ఆనందంగా ఉంది.
ఆయనతో నా ప్రయాణాన్ని మర్చిపోలేను’ అని వరుణ్తేజ్ పేర్కొన్నారు. ‘ఎఫ్-3’ చిత్రంలో ప్రతి పాత్ర నవ్వుల్ని పంచుతుందని, రామానాయుడి తర్వాత మూవీ మొఘల్గా దిల్రాజును పిలుచుకుంటామని రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో అలీ, సునీల్, సీనియర్ నటి తులసి, వై.విజయ, కథానాయికలు మెహరీన్, సోనాల్చౌహాన్, గీత రచయితలు భాస్కరభట్ల, కాసర్ల శ్యామ్ పాల్గొన్నారు.