ప్రముఖ నిర్మాత, ఎగ్జిబిటర్ నారాయణదాస్ కె నారంగ్ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నారాయణదాస్ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు, వాణిజ్య మండలి సభ్యులు సంతాపం తెలిపారు. 1946 జూలై 27న జన్మించిన నారాయణదాస్ కె నారంగ్ పంపిణీరంగంలో ప్రయాణం మొదలుపెట్టారు.
పలు విజయవంతమైన చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేశారు. గ్లోబల్ సినిమాస్, ఏషియన్ గ్రూప్ సంస్థలను స్థాపించి హైదరాబాద్లో మల్టీప్లెక్సులను ప్రారంభించారు. నగరంలో ఈ మల్టీప్లెక్సులతో సినిమా ప్రదర్శనలకు మరింత ఉత్సాహాన్ని అందించారు. ఫైనాన్షియర్గా, ఎగ్జిబిటర్గా, నిర్మాతగా ఆయన పరిశ్రమ అభివృద్ధిలో భాగమయ్యారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారులు సునీల్ నారంగ్, భరత్ నారంగ్ నిర్మాతలుగా కొనసాగుతున్నారు.
నిర్మాతగా విజయాలు…
నిర్మాతగా మారి శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ సంస్థలో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు నారాయణదాస్ కె నారంగ్. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరి’. నాగ శౌర్య హీరోగా ‘లక్ష్య’ చిత్రాలను నిర్మించారు. ప్రస్తుతం ఆయన నిర్మాణంలో నాగార్జున హీరోగా ‘ఘోస్ట్’, ధనుష్, శేఖర్ కమ్ముల చిత్రం, శర్వానంద్ కొత్త సినిమాతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్లు ఉన్నాయి.
సినీ రాజకీయ ప్రముఖుల సంతాపం
నారాయణదాస్ కె నారంగ్ మృతి విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సంతాపాలు తెలియజేశారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, చిరంజీవి, మహేష్ బాబు, నాగార్జున, నాగ చైతన్య, నిర్మాత సురేష్ బాబు తదితరులు ఆయన స్వగృహానికి వెళ్లి నివాళులు అర్పించారు. మంగళవారం సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో నారాయణదాస్ కె నారంగ్ అంత్యక్రియలు జరిగాయి.