By Maduri Mattaiah
‘దేవుడు ఆజ్ఞాపించాడు.. ఈ వెంకటేష్ పాటిస్తున్నాడు.. అంతేతప్ప నాకు ప్రత్యేకంగా ఇది కావాలని, నేను ఇలా వుండాలని.. ఇలాంటి సినిమాలు చేయాలని నేను ఆశించను. ఏ సమయానికి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేస్తాను. అయితే చేసే పని మాత్రం నిజాయితీగా చేస్తాను’ అంటున్నారు సీనియర్ కథానాయకుడు దగ్గుబాటి వెంకటేష్. ఆయన కథానాయకుడిగా రూపొందిన తాజా చిత్రం ‘దృశ్యం-2’. జీతూ జోసెఫ్ దర్శకుడు. గతంలో విడుదలై ఘనవిజయం సాధించిన ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్గా రాబోతున్న ఈ చిత్రం ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్లో నేరుగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా వెంకటేష్తో నమస్తే తెలంగాణ.కమ్ జరిపిన ఇంటర్వ్యూ ఇది.
‘నారప్ప’ తరువాత ఇప్పుడు దృశ్యం-2 ఇలా వరుసగా మీ సినిమాలు ఓటీటీలోనే విడుదల చేస్తున్నారు ఎందుకని?
సినిమాల్లో నటించడం నా బాధ్యత.. ఇక సినిమా విడుదల వాటి ఆర్థిక వ్యవహారాలు నిర్మాతల సెక్షన్. ఇది తప్పు, ఇది కరెక్ట్ అని ఏమీ వుండదు. పరిస్థితులకు తగ్గట్టుగా వెళ్లిపోవాలి. ఈ సినిమా బడ్జెట్కు ఓటీటీ బెస్ట్ అని నిర్మాతలు భావించారు అందుకే ఓటీటీలో సినిమాలు వస్తున్నాయి. ఎఫ్-3తో పాటు ఇంకా చాలా సినిమాలు చేస్తాను. ఆ సినిమాలు థియేటర్లో కూడా వస్తాయి.
దృశ్యం-2 ఎలా వుంటుంది?
కుటుంబం కోసం ఏదైనా చేసే వ్యక్తి రాంబాబు. అతను చేసే పని తప్పా-ఒప్పా అని ఆలోచించడు. తన ఫ్యామిలీని కాపాడుకోవడమే రాంబాబు ముఖ్య లక్ష్యం. అలాంటి పాత్రలో నటించడం ఆనందంగా వుంది. అంతా సమసిపోయిందని అనుకున్న సమయంలో ఆరేళ్ల తరువాత ఇన్వ్స్టిగేషన్ మొదలవ్వడం, మళ్లీ సమస్యలు రావడం, వాటిని రాంబాబు ఎలా అధిగమించాడు అనేది ఎంతో ఉత్కంఠగా వుంటుంది.
రాంబాబు పాత్రను మళ్లీ పోషించడం మీకు ఎలా అనిపిస్తుంది?
ఇది చాలా గొప్ప పాత్ర. తనలో తాను మదనపడే వ్యక్తి కథ. ఏం జరిగిందనేది ఫ్యామిలీకి కూడా చెప్పడు. ఫ్యామిలీని రక్షించడం మాత్రం తెలుసు. మలయాళంలో మోహన్లాల్ అద్భుతంగా నటించాడు. రాంబాబు పాత్రలో మరోసారి నటించడం సంతోషంగా వుంది.
సాధారణంగా సీక్వెల్ సినిమాలు అంతగా విజయవంతం కాలేదు..?
ఈ కథను దర్శకుడు ‘దృశ్యం’ కంటే అద్భుతంగా తయారుచేశాడు. రాంబాబు ఇన్ని రకాలుగా ఆలోచిస్తాడా? ఇలా కూడా ఆలోచిస్తారా? అనేది విధంగా ఈ సినిమా స్క్రీన్ప్లే వుంటుంది.
‘దృశ్యం’ చూడని వాళ్లకు ఈ సీక్వెల్ అర్థమవుతుందా?
మొదటి పార్ట్ చూడకపోయినా దృశ్యం-2 అర్థమయ్యే విధంగా ఈ చిత్ర కథ వుంటుంది. ఒకవేళ మొదటిపార్ట్ చూడాలనుకున్నా ఓటీటీలో అందరికి అందుబాబులో వుంది.
మలయాళంలో పోలిస్తే తెలుగు రీమేక్లో ఏమైనా మార్పులు చేశారా?
పెద్దగా మార్పులేమీ చేయలేదు. మన నేటివిటికి తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలు వుంటాయి. కానీ కథలో ఆత్మ మాత్రం అలాగే వుంటుంది.
నారప్ప రీమేక్, దృశ్యం-2, ఎఫ్-3 సీక్వెల్స్ ఇలా రెడీమేడ్గా రీమేక్లు, సీక్వెల్స్ సినిమాలే చేస్తున్నారు. తెలుగులో మీ ఇమేజ్ తగిన కథలు దొరకడం లేదా?
నేను ఎప్పుడూ ఇమేజ్ గురించి ఆలోచించను. అదృష్టం కొద్ది ఈ రంగంలోకి వచ్చాను. ప్రేక్షకులు అభిమానం చూపిస్తున్నారు. అందుకే కొత్త చేసేందుకు ప్రయత్నిస్తున్నాను. భవిష్యత్లో కూడా అందరిని ఎంటర్టైన్ చేసే సినిమాలే చేస్తాను. కొత్త దర్శకులతో కూడా చేస్తాను. నేను ఇలాంటి చిత్రాలే, రీమేక్లే, సీక్వెల్స్ చేయాలని అనుకోను. నా దగ్గరికొచ్చిన సినిమాల్లో నాకు నచ్చిన సినిమాలు చేస్తున్నాను.
దృశ్యంకు మూడో పార్ట్ కూడా వుంటుందా?
అది ఇప్పుడే తెలియదు. అయితే ఈ సారి మాత్రం చాలా సమయం పడుతుందని మాత్రం చెప్పొచ్చు.మూడు నాలుగేళ్లు పడుతుంది. ఈ సారి తెల్లగడ్డంతో కనిపించినా ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదు.
ఎఫ్-3లో కూడా మీ పాత్రలో ఫ్రస్టేషన్ వుంటుందా?
ఈ సినిమాలో డబ్బుల గురించి ఫ్రస్టేషన్ వుంటుంది. డబ్బు చుట్టు ఈ కథ తిరుగుతుంది. అందరికి కనెక్ట్ అయ్యే కథ ఇది. దాదాపు చిత్రీకరణ పూర్తయింది. సమ్మర్లో సినిమా వచ్చే అవకాశాలున్నాయి.
కరోనాతో వ్యక్తుల్లో, సమాజంలో మార్పులు ఏమైనా గమనించారా?
జీవితం చాలా చిన్నది.. ఇంకా ఎవరూ మారడం లేదు. ఫస్ట్ లాక్డౌన్ సమయంలో జానాలు మాకేం వద్దు బతికితే చాలు.. ఇప్పుడు మళ్లీ అంతా షరామామూలే.. మళ్లీ అన్ని మొదటికి వచ్చాయి. అదే అసూయ, ఆరాటాలు.. ఆర్భాటాలు కనిపిస్తున్నాయి.
ఓటీటీ, థియేటర్లో ఈ రెండింటిలో సినిమా విడుదలైన తరువాత వచ్చే ఫీడ్బ్యాక్ విషయంలో ఏమైనా మార్పును గమనించారా?
ఎక్కువగా ఏమీ ఆశించొద్దు.. అనేది నా పాలసీ, వచ్చిన దాన్ని స్వీకరించాలి. ఫీడ్బ్యాక్ అనే దాంట్లో ప్లస్, మైనస్లుంటాయి. హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒకేలా రిసీవ్ చేసుకోవాలి. కానీ తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని పాఠాలు నేర్చుకోవాలి. అయితే ఓటీటీలో రిలీజ్ అయితే ఎప్పుడైనా సినిమా చూడొచ్చు..ఓటీటీలోని అందం ఇదే. కొన్ని సినిమాలు వెంటనే చూస్తారు. కొన్ని మెల్లిగా చూస్తారు. థియేటర్లో అయితే థియేటర్లలో వెళ్లిపోకముందే చూడాలి.
రానాతో కలిసి నటించే సినిమా ఎలా వుంటుంది?
రానాతో కలిసి నెట్ఫ్లిక్ కోసం ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమాలో డిఫరెంట్ లుక్లో కనిపిస్తాను( ఆ లుక్ను, గెటప్ను తన మొబైల్ ఫోన్లో చూపించారు వెంకీ)
– MADURI MATTAIAH