నిర్మాతగా తొలి చిత్రాన్నే సూపర్హీరో జోనర్లో చేయడం ఆనందంగా ఉందని చెప్పారు కె.నిరంజన్ రెడ్డి. డిస్ట్రిబ్యూటర్గా ఉభయ తెలుగు రాష్ర్టాల్లో సుపరిచితుడైన ఆయన ‘హను-మాన్’ చిత్రం ద్వారా నిర్మాతగా అరంగేట్రం చేస్తున్నారు. ప్రశాంత్వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్మాత కె.నిరంజన్ రెడ్డి పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
‘హను-మాన్’ సోషియో ఫాంటసీ అంశాలతో కూడిన సూపర్ హీరో జోనర్ చిత్రం. హనుమంతుడు చిరంజీవి. ఆయన ఇప్పటికీ హిమాలయాల్లో తపస్సు చేస్తూ ఉన్నారని భారతీయులు విశ్వసిస్తారు. యూనివర్సల్ సూపర్హీరో హనుమాన్. ఆయన మహాబలశాలి. అసాధారణమైన శక్తియుక్తులు కలిగివాడు. దుష్టశిక్షణ కోసం ఆయన చేసిన అద్భుత విన్యాసాలను ఈ సినిమాలో ఆవిష్కరించాం. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులందరూ ఓ కొత్తలోకంలో విహరించిన అనుభూతికిలోనవుతారు.
ఐదురెట్లు బడ్జెట్ పెరిగింది
దర్శకుడు ప్రశాంత్వర్మ ఈ కథ చెప్పినప్పుడే గ్లోబర్ ఆడియెన్స్కు రీచ్ అవుతుందనిపించింది. హాలీవుడ్ మార్వెల్ డీసీ చిత్రాల తరహాలో మన ఇండియన్ సినిమాలకు ఫ్రాంఛైజీలు లేవు. ఆ లోటును భర్తీ చేయాలని ‘హను-మాన్’ చేశాం. అనుకున్న బడ్జెట్కంటే ఐదారు రెట్లు ఎక్కువైంది. ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నాం. కేవలం తెలుగు రాష్ర్టాల్లోనే 20కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా అనుకున్న దానికంటే ఎక్కువే జరిగింది. సంకా్రంతి పోటీ గురించి మేము పెద్దగా ఆలోచించడం లేదు. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ‘బేబీ’ ‘బలగం’ లాంటి సినిమాలు అదే విషయాన్ని నిరూపించాయి.
మూడేళ్లు కష్టపడ్డాం
హను-మాన్ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. టీజర్కు ఎక్ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడా ఒక్క నెగెటివ్ కామెంట్ కూడా రాలేదు. ఈ డిజిటల్ యుగంలో నిజంగా అదొక గ్రేట్ అచీవ్మెంట్. ఈ చిత్రానికి లాంగ్న్ ఉంటుందని ఆశిస్తున్నాం. ఓ ఆరువారాల పాటు థియేటర్స్లో ఆడుతుందని అనుకుంటున్నాం. ఇంకా ఈ సినిమాలో చాలా సర్ఫ్రైజ్లుంటాయి. వాటిని తెరపై చూడాల్సిందే. ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్లు కష్టపడ్డాం. వందశాతం ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం. మా సంస్థ తదుపరి చిత్రాల వివరాలను ఫిబ్రవరిలో వెల్లడిస్తాం.