ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ చెన్నైలో కన్నుమూసారు.పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకి చెందిన ఈశ్వర్ .. ఆర్టిస్ట్ కేతా వద్ద పోస్టరు డిజైనింగ్లో మెలకువలు నేర్చుకున్నారు. ఆయన పూర్వీకులు దేవాలయ వాహనాలు, ఉత్సవాల విగ్రహాలు చేసేవారు. స్వాతంత్ర్య వేడుకల్లో గాంధీ బొమ్మను గీసి అందరి మన్ననలు పొందారు ఈశ్వర్.
కాకినాడ పాలిటిక్నిక్ కాలేజీలో చదువును మధ్యలోనే ఆపేసిన ఈశ్వర్ స్నేహితుని సాయంతో మద్రాస్ వెళ్లారు. పబ్లిసిటీ ఆర్టిస్ట్గా స్థిరపడాలని నిర్ణయించుకున్న ఈశ్వర్.. ఆర్టిస్ట్ కేతా వద్ద మెళుకువలు నేర్చుకున్నారు.ఈశ్వర్ పేరుతో సొంత పబ్లిసిటీ కంపెనీ స్థాపించారు. బాపు సాక్షితో తెలుగులో పబ్లిసిటీ పనులు మొదలు పెట్టారు ఈశ్వర్. సాక్షి సినిమాల కలర్ పోస్టర్స్, లోగోను రూపొందించిన ఆయన బ్రష్ వాడకుండా నైఫ్ వర్క్తో పాప కోసం చిత్ర పోస్టర్స్ రూపొందించారు.
హిందీ, తమిళంలోను ఆయన గుర్తింపు పొందారు. అగ్రశ్రేణి హీరోల సినిమాలకు కూడా పబ్లిసిటీ డిజైన్స్ రూపొందించారు ఈశ్వర్. సౌత్ ఇండియన్ పబ్లిసిటీ డిజైనర్ సంఘ అధ్యక్షుడిగా పని చేసిన ఆయన 2600 సినిమాలకు పబ్లిసిటీ డిజైన్స్ అందించారు. తితిదే కూడా ఈశ్వర్ చిత్రాలను క్యాలెండర్స్గా వేయించింది. ఆయనకు రఘుపతి వెంకయ్ నాయుడు పురస్కారం కూడా దక్కింది. సినిమా పోస్టర్ అనే పుస్తకాన్ని కూడా ఆయన రాసారు. ఉత్తమ చలన చిత్ర పుస్తక విభాగంలో ఆయన రాసిన పుస్తకానికి నంది అవార్డ్ దక్కింది. ఈశ్వర్ మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.