Adolescence | ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో వచ్చిన “అడాల్సెన్స్”(Adolescence) అనే బ్రిటీష్ వెబ్ సిరీస్పై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్పై బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, అనురాగ్ కశ్యప్తో పాటు అలియా భట్ ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ సిరీస్ చూసిన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi) బాలీవుడ్ను ఉద్దేశించి ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఇలాంటి ప్రయోగాత్మక వెబ్ సిరీస్లను బాలీవుడ్ తీయడం మానేసిందని తెలిపాడు.
‘అడాల్సెన్స్’ స్టోరీ చాలా అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. బాలీవుడ్లో ఇలాంటి కొత్త కథతో ఎవరైనా వెళితే వారిని పిచ్చివాళ్లలా చూస్తారు. ఎందుకంటే హిందీ చిత్ర పరిశ్రమ కొత్త ఆలోచనలను స్వీకరించడం లేదు, రిస్క్ తీసుకోవడానికి భయపడుతోంది. ఎంత మంచి ఆలోచన ఉన్నా ఒకే రకమైన కథలను రూపొందించడానికి భయపడుతున్నారు. ‘అడాల్సెన్స్’లో సోషల్ మీడియా వాడకం వల్ల కలిగే నష్టాలను చాలా చక్కగా చూపించారు. ఈ సిరీస్లోని నాలుగు ఎపిసోడ్లను ఒక్క షాట్లో చిత్రీకరించడం విశేషం. ఇదే విషయాన్ని బాలీవుడ్ నిర్మాతలకు చెబితే, మధ్యలో ఏమైనా తప్పు జరిగితే మళ్లీ మొదటి నుండి తీయాల్సి వస్తుందని, దాని వల్ల ఖర్చు పెరుగుతుందని చెబుతారు. ఇలాంటి ప్రయత్నాలు చేయాలంటే ధైర్యం ఉండాలి.
బాలీవుడ్ పూర్తిగా కొత్తదనానికి దూరమైంది. పాత సినిమాల్లోని కథలనే కొద్దిగా మార్చి మళ్లీ తీస్తున్నారు. ఇది సురక్షితమైన మార్గం. రణ్బీర్ కపూర్ నటించిన ‘యానిమల్’ సినిమా విడుదలైనప్పుడు చాలా మంది విమర్శించారు. కానీ ఇప్పుడు అందరూ అదే తరహా కథలను అనుసరిస్తున్నారు. బాలీవుడ్ వాళ్ళు ట్రెండ్ను ఫాలో అవుతున్నారు కానీ, కొత్త ట్రెండ్ను సృష్టించలేకపోతున్నారంటూ ఇమ్రాన్ చెప్పుకోచ్చాడు.
ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. ఈ సిరీస్ 13 ఏళ్ల బాలుడు జమీ చుట్టూ తిరుగుతుంది. కేటీ అనే బాలిక స్కూల్ పరిసరాల్లో దారుణ హత్యకు గురవడంతో.. ఈ నేరం కింద జమీని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అనంతరం అతడు హత్య చేయడానికి గల కారణాన్ని విచారిస్తారు పోలీసులు. అయితే ఈ విచారణలో జమీ హత్య చేశాడా.. అసలు ఎందుకు హత్య చేశాడు.. దానికి గల కారణం ఏంటి. ఈ హత్య అతని జీవితాన్ని, అతని చుట్టూ ఉన్నవారి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనేది ఈ కథలోని ముఖ్యాంశం. మొత్తం మూడు ఎపిసోడ్లుగా విడుదలైన ఈ చిత్రం ఒక్కొక్కటి గంట నిడివిని కలిగి ఉంది. అలాగే రియాలీటికి దగ్గరగా ఉండాలని ప్రతి ఎపిసోడ్ను సింగిల్ షాట్లో చిత్రీకరించారు మేకర్స్. మొదటి ఎపిసోడ్ పోలీస్ స్టేషన్లో జరుగగా.. రెండోది స్కూల్ వాతావరణంలో. మూడోది జైలు నేపథ్యంలో సాగుతుంది. ఈ మూడు వేర్వేరు ప్రదేశాలు జమీ జీవితంలోని విభిన్న కోణాలను, అతని మానసిక పరిణామాన్ని చూపిస్తాయి. ఈ డిజిటల్ యుగంలో ఆన్లైన్కి అలవాటు పడిన పిల్లలు ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనే స్టోరీతో ఈ సిరీస్ వచ్చింది. టీనేజీ యువత ఎదుర్కోంటున్న అతిపెద్ద సమస్యను ఈ సిరీస్లో చూపించారు మేకర్స్.