Hema Malini | ప్రముఖ నటి హేమమాలిని మరోసారి లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. యూపీలోని మధుర లోక్సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. బీజేపీ తరఫున ఆమె బరిలోకి దిగుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో హేమమాలిని నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధుర ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ఇక సీనియర్ నటి ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్లో ఆస్తుల విలువ రూ.278 కోట్లుగా ప్రకటించారు. ఇంతకు ముందు 2019లో నటి తన ఆస్తులు రూ.250కోట్లుగా ప్రకటించారు. 2014లో ఆస్తులు రూ.178 కోట్లు ఉన్నట్లుగా వెల్లడించారు.
గడిచిన పదేళ్లలో ఆమె ఆస్తుల విలువ రూ.100కోట్లు పెరిగాయి. 2018-19లో హేమమాలిని వార్షిక ఆదాయం రూ.1.16కోట్లు. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో నష్టం వచ్చినట్లు తెలిపారు. 2019-20లో ఆదాయం రూ.69.56లక్షలకు తగ్గింది. 2020-21లో ఆదాయం తగ్గి రూ.64.11లక్షలకు చేరింది. ఇక 2021-22లో రాబడిలో గణనీయంగా పెరుగుదల ఉన్నది. ఏకంగా రూ.1.85కోట్లకు పెరగ్గా.. 2022-23లో మళ్లీ రూ.1.27కోట్లకు చేరింది. ఇక హేమమాలి భర్త, సీనియర్ నటుడు ధర్మేంద్ర ఆదాయం 2018-19లో రూ.1.17కోట్లు.. ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో 2019-20లో సంపాదన రూ.1.15కోట్లకు తగ్గింది. అఫిడవిట్ ప్రకారం.. ధర్మేంద్ర సంపాదన 2020-21లో తగ్గి రూ. 88.75 లక్షలకు చేరింది. 2021-22లో రూ.2.28కోట్లకు చేరింది. 2022-23 సంవత్సరంలో నష్టపోగా.. ఈ ఏడాది రూ.2.11 కోట్లను ఆర్జించారు.
ఇక ప్రస్తుతం తన వద్ద రూ.18.52లక్షల నగదు ఉందని హేమమాలిని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆమె భర్త వద్ద రూ.49.19లక్షల నగదు ఉందని చెప్పారు. హేమమాలిని బ్యాంకు ఖాతాల్లో రూ.99.93 లక్షలు, ధర్మేంద్ర ఖాతాల్లో రూ.3.52కోట్లు ఉన్నట్లుగా తెలిపారు. రూ.2.57కోట్ల నిధులను బాండ్లు, డిబెంచర్స్, కంపెనీల్లో షేర్ల రూపంలో డిపాజిట్ చేసినట్లు నటి వెల్లడించారు. ధర్మేంద్ర కంపెనీల్లో నిధులు, బాండ్లు, డిబెంచర్లు, షేర్ల రూపంలో రూ.4.55 కోట్లు డిపాజిట్ చేశారు. హేమమాలిని రూ.4.28కోట్లు.. ధర్మేంద్ర రూ.7.19కోట్లు రుణాలు తీసుకున్నట్లుగా తెలిపారు. ఇక అఫిడవిట్లో హేమమాలిని వద్ద రూ.61.53లక్షల విలువైన వాహనాలు, ధర్మేంద్ర వద్ద రూ.8.12లక్షల విలువైన వాహనాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఎంపీ వద్ద రూ.3.39కోట్లు ఆభరణాలు, ధర్మేంద్ర వద్ద రూ.1.07కోట్ల విలువైన నగదు, విలువైన వస్తువులు ఉన్నట్లుగా అఫిడవిట్లక్ష తెలిపారు. ఇక ఎంపీకి రూ.12.09కోట్లు, ఆమె భర్తకు రూ.17.15కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లుగా వెల్లడించారు.
పుణేలోని ఖండాలాలో 4.11లక్షల చదరపు అడుగులు వ్యవసాయేతర భూమి ఉందని పేర్కొన్నారు. మార్కెట్లో దీని విలువ రూ.2.09కోట్లు ఉంటుందని చెప్పారు. ధర్మేంద్ర పేరిట రూ.9.36కోట్ల విలువైన వ్యవసాయేతర భూమి ఉందని చెప్పారు. అదే సమయంలో హేమమాలికి రూ.111కోట్ల విలువైన నివాస భవనం ఉందని.. ముంబయిలోని విలే పార్లే ప్రాంతంలో ఉందని తెలిపారు. 24వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా ప్రస్తుత మార్కెట్ విలువ రూ.126కోట్లుగా తెలిపారు. సీనియర్ బాలీవుడ్ నటి తన ఎన్నికల అఫిడవిట్లో మొత్తం రూ.249.68కోట్ల విలువైన స్థిరాస్తులను ప్రకటించారు. ఇక స్థిర, చరాస్తులను కలిపితే విలువ రూ.278.93 కోట్లుగా ఉండనున్నది. ఇక హేమమాలికి రూ.14.22కోట్లు, ధర్మేంద్ర పేరిట రూ.6.49కోట్ల అప్పులున్నట్లుగా వివరించారు. హేమ మాలిని వ్యాపారం, అద్దె, వడ్డీ ఆదాయాన్ని తన ఆదాయ వనరులుగా తెలిపారు. ధర్మేంత సైతం ఇదే తరహాలో ఆదాయం పొందుతున్నట్లుగా అఫిడవిట్లో వివరించారు.