Eesha Rebba | సోషల్ మీడియా క్రేజ్ పెరుగుతున్న నేపథ్యంలో సెలబ్రిటీలపై ఆన్లైన్ వేధింపులు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా నటీమణులు లక్ష్యంగా అసభ్యకర కామెంట్లు, ట్రోలింగ్లు మితిమీరుతున్న నేపథ్యంలో తాజాగా తెలుగు నటి ఈషా రెబ్బ పోలీసులను ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. తనపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సమాచారం ప్రకారం, ఈషా రెబ్బ ఇటీవల తన తాజా చిత్రం ఓం శాంతి శాంతి శాంతి ప్రమోషన్లలో పాల్గొంటూ బిజీగా ఉన్న సమయంలో ఓ సోషల్ మీడియా మీమ్ పేజీలో ఒక వ్యక్తి ఆమెను లక్ష్యంగా చేసుకుని తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్య పోస్ట్ చేశాడు. ఆ వ్యాఖ్యలు లైంగిక వేధింపులకు దారితీసేలా ఉండటంతో పాటు పరువు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
ఆ వ్యక్తి ఉపయోగించిన భాష తనను తీవ్ర మానసిక వేదనకు గురిచేసిందని, ఒక మహిళగా తన గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరించారని ఈషా పోలీసులకు తెలిపింది. బహిరంగ వేదికలో అవమానించే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ విషయంపై ఈషా రెబ్బ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉండగా, ఈషా రెబ్బ నటించిన ఓం శాంతి శాంతి శాంతి సినిమా ఇటీవల విడుదల కాగా, మూవీకి మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. మలయాళంలో విజయం సాధించిన జయ జయ జయ జయ హే చిత్రానికి ఇది అధికారిక రీమేక్. ఏఆర్ సజీవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఈషా సరసన తరుణ్ భాస్కర్ హీరోగా నటించారు.
సినిమా ప్రమోషన్ల సమయంలోనే ఈ వివాదం చోటుచేసుకోవడం గమనార్హం. ఇటీవల ఈషా రెబ్బ, తరుణ్ భాస్కర్ పెళ్లి వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలను ఇద్దరూ అధికారికంగా ధృవీకరించలేదు. సరైన సమయం వచ్చినప్పుడు చెబుతానని తరుణ్ భాస్కర్ చెప్పగా, అలాంటిదేమీ లేదని ఈషా స్పష్టం చేయడం విశేషం.