హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారుల విచారణకు సినీనటుడు తనీశ్ హాజరయ్యాడు. శుక్రవారం ఉదయం నాంపల్లిలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్న తనీశ్ను ఈడీ అధికారులు దాదాపు ఏడు గంటలపాటు ప్రశ్నించారు. 2017లో ఎక్సైజ్శాఖ అధికారులు నమోదు చేసిన కేసులోనూ నటుడు తనీశ్ విచారణ ఎదుర్కొన్నారు. 2015 నుంచి 2017 వరకు తనీశ్ బ్యాంకు లావాదేవీల వివరాలను ఈడీ అధికారులు సేకరించినట్టు తెలిసింది. వాటి ఆధారంగా అందులోని పలు లావాదేవీలపైన ఈడీ అధికారులు ప్రశ్నించినట్టు సమాచారం. ప్రధానంగా ఎఫ్-క్లబ్ మేనేజర్, డ్రగ్స్ సరఫరాదారుడు కెల్విన్, ఈవెంట్ మేనేజర్ జీషాన్అలీలతో పరిచయం, వారికి ఎప్పుడైన డబ్బులు పంపించారా?…ఎఫ్క్లబ్లో పార్టీలకు హాజరయ్యేవారా?..అక్కడ ఎలాంటి పార్టీలు జరిగేవి..? సినీ పరిశ్రమకు చెందిన ఇంకెవరెవరు వచ్చేవాళ్లు..ఇలా పలు అంశాలపైన ఈడీ అధికారులు తనీశ్ నుంచి సమాచారం సేకరించినట్టు తెలిసింది. దాదాపు ఏడుగంటల విచారణ అనంతరం బయటికి వచ్చిన తనీశ్, ఈడీ అధికారులు అడిగిన అన్ని పత్రాలు సమర్పించానని, అడిగిన అన్ని అంశాలకు సమాధానమిచ్చినట్టు మీడియాకు తెలిపారు. ఈడీ అధికారులు మళ్లీ ఎప్పుడు విచారణకు పిలిచినా వచ్చేందుకు తాను సిద్ధమని, ఈడీ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు.