‘మహానటి’ ‘సీతారామం’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ను సంపాదించుకున్నారు మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్-కె’ చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలిసింది. నాగ్అశ్విన్ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ కథాంశంతో ‘ప్రాజెక్ట్-కె’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో కథాగమనాన్ని మలుపుతిప్పే ఓ ముఖ్యమైన పాత్ర కోసం చిత్రబృందం దుల్కర్ సల్మాన్ను సంప్రదించగా ఆయన అంగీకరించారని సమాచారం. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘మహానటి’లో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించారు. ఈ సినిమా నుంచే నాగ్అశ్విన్, దుల్కర్ సల్మాన్ మధ్య చక్కటి స్నేహసంబంధాలు ఏర్పడ్డాయి. దాంతో తనది చిన్న పాత్రే అయినా ‘ప్రాజెక్ట్-కె’లో నటించడానికి దుల్కర్ ఒప్పుకున్నారని చెబుతున్నారు. ‘ప్రాజెక్ట్-కె’ చిత్రంలో దీపికా పడుకోన్ కథానాయికగా నటిస్తున్నది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది.