Drishyam | ఎన్ని సార్లు చూసినా క్యూరియాసిటీ పెంచే సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి అరుదైన సినిమాల్లో ఒకటి దృశ్యం (Drishyam) . మలయాళంలో జీతూ జోసెఫ్ దర్శకత్వంలో క్రైం థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న దృశ్యం ప్రాంఛైజీగా కూడా వచ్చిన విషయం తెలిసిందే. మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు.
దృశ్యం ఇప్పటికే మాతృక నుంచి తమిళం, హిందీ, కన్నడ, సిన్హాలీస్, చైనీస్లో కూడా రీమేక్ అయింది. అంతేకాదు గతేడాది కొరియన్ రీమేక్ కూడా ప్రకటించారు. ఇప్పటికే చాలా భాషల్లో రీమేక్ అయి టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచిన ఈ చిత్రం తాజాగా అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులను కూడా ఇంప్రెస్ చేసేందుకు రెడీ అవుతోంది. పనోరమ స్టూడియోస్ ఆఫ్ ఇండియా పాపులర్ యూఎస్ కంపెనీలైన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, జోట్ ఫిలిమ్స్తో అసోసియేట్ అవుతూ హాలీవుడ్లో రీమేక్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
దృశ్యం హిందీ వెర్షన్ను నిర్మించిన పనోరమ స్టూడియోస్ ప్రాంఛైజీ ఇంటర్నేషనల్ రీమేక్ రైట్స్ను ఆశీర్వాద్ సినిమాస్ నుంచి కొనుగోలు చేసింది. దృశ్యం కథనం అంతర్జాతీయ స్థాయి ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుందని, రాబోయే ఐదేళ్లలో 10 దేశాల్లో ఈ సినిమాను నిర్మించే ప్లాన్ చేస్తున్నామని పనోరమ స్టూడియోస్ ఛైర్మన్ కుమార్ మంగళ్ పాఠక్ చెప్పారు.
టైం లెస్ థ్రిల్లర్ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు అందించాలని, యూఎస్లో ఉన్న ఆడియెన్స్కు అందించేందుకు వేచి ఉండలేకపోతున్నామని మేకర్స్ తన ఎక్జయిట్మెంట్ను షేర్ చేశారు.