కె-పాప్, కె-డ్రామాలంటే ఇండియన్ యూత్కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొరియన్ సినిమాలనూ ఓటీటీల్లో విపరీతంగా చూస్తున్నారు మనవాళ్లు. అయితే ఇప్పుడు గాలి మళ్లింది. భారత చిత్రాల మీద కొరియన్లు మనసు పడుతున్నారు. త్వరలో మన దృశ్యం సినిమా కొరియన్లోకి రీమేక్కు సిద్ధం కావడమే ఇందుకు సాక్ష్యం. దృశ్యం సినిమా… ఒక హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని కాపాడేందుకు ఒక తండ్రి చేసిన ప్రయత్నం. ధర్మాగ్రహంలో చేసిన పనే అయినా చట్టానికి దొరక్కుండా తన భార్యాబిడ్డల్ని కాపాడుకునేందుకు అతను వేసిన ప్లాన్స్, సినిమాకు ఊహించని ట్విస్టుల్ని తెచ్చిపెడతాయి. ఆ మలుపులే సినిమాను రక్తికట్టించి జనాన్ని థియేటర్లకు క్యూ కట్టించాయి.
మలయాళ మాతృకగా, మోహన్లాల్ హీరోగా తొలుత విడుదలైన ఈ సినిమా… తర్వాత కన్నడం, తెలుగు, హిందీల్లోకీ రీమేక్ అయి సూపర్హిట్గా నిలిచింది. రెండు భాగాలుగా వచ్చిన ‘దృశ్యం’ ఓటీటీలో రికార్డు హిట్ సాధించింది. కథ, కథనం రెండూ ఆకట్టుకునేలా ఉండటం ప్రపంచాన్నే ఈ సినిమావైపు చూసేలా చేసిందని చెప్పేలా… ఇప్పుడు కొరియన్ డైరెక్టర్లు దీని రీమేక్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. హిందీ ‘దృశ్యం’ సినిమాని రీమేక్ చేయడానికి దక్షిణ కొరియా దర్శక నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. అక్కడి ప్రఖ్యాత నటుడు సాంగ్ కాంగ్ హో ప్రధాన పాత్రలో, కిమ్ జీ ఊన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇండియన్ మూలాలతో, కొరియన్ ఫ్లేవర్ను జోడించి ఈ సినిమాను చిత్రీకరించనున్నట్టు తెలిపారు నిర్మాత జాయ్ చోయ్.