సినీరంగంలో కీర్తిప్రతిష్టల గురించి ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పింది పంజాబీ ముద్దుగుమ్మ తాప్సీ. ఆధునిక భావాలు కలిగిన యువతిగా సమాజానికి ప్రేరణనిచ్చే కథల్ని ఎంచుకుంటూ కెరీర్ను తీర్చిదిద్దుకుంటున్నానని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘కథల ఎంపికలో గత కొన్నేళ్ల నుంచి నా ప్రాధామ్యాలు మారిపోయాయి. సమాజానికి ఏమాత్రం ఉపయుక్తం కానీ ఫక్తు కమర్షియల్ సినిమాలు చేస్తూ ప్రేక్షకుల సమయాన్ని వృథా చేయాలనుకోవడం లేదు. అందుకే నా మనసుకు నచ్చిన కథల్నే ఎంపిక చేసుకుంటున్నా. ఒకే తరహా పాత్రల్ని పునరావృతం చేయడం బోర్గా ఫీలవుతా. ప్రతి విషయంలో కొత్తదనానికి పెద్దపీట వేయడం నా నైజం. సినిమా కథలు కూడా అదే తీరుగా వైవిధ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. నేను పోషించే పాత్రలతో ప్రేక్షకులు సహానుభూతి చెందగలిగితే అదే గొప్ప అచీవ్మెంట్గా భావిస్తాను’ అని చెప్పింది తాప్సీ. కెరీర్ ఆరంభంలో గ్లామర్ నాయికగా ముద్రపడ్డ ఈ భామ అనంతరకాలంలో తన పంథా మార్చుకుంది. బాలీవుడ్లో పింక్, బద్లా, థప్పడ్, నామ్ షబానా, సాండ్ కీ ఆంఖ్, మిషన్ మంగళ్ వంటి స్ఫూర్తిదాయక చిత్రాల్లో నటించి సత్తా చాటింది. ప్రస్తుతం ఆమె భారత మహిళా క్రికెటర్ మిథాలీరాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న ‘శభాష్ మిత్తు’ చిత్రంలో నటిస్తోంది.