Dhanush 55 | కోలీవుడ్లో ఈ ఏడాది దీపావళి పండుగకు బాక్సాఫీస్ దగ్గర మరోసారి భారీ వార్కు రంగం సిద్ధమవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పటికే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ కోసం దిగ్గజ ఓటీటీ సంస్థల మధ్య పోటీ నెలకొనగా, డీల్ దాదాపు ఫైనల్ స్టేజ్లో ఉంది. అంతేకాదు, ఈ సీక్వెల్లో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ఒక పవర్ఫుల్ క్యామియో రోల్లో సందడి చేయనున్నాడు. వచ్చే వారం నుంచి హృతిక్ పార్ట్ షూటింగ్ను ప్లాన్ చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘జైలర్ 2’ను దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది.
ఇదిలా ఉంటే నటుడు ధనుష్ కూడా అదే దీపావళి రేసులోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ధనుష్ కెరీర్లో 55వ చిత్రంగా ‘అమరన్’ ఫేమ్ రాజ్కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తుండగా, స్టార్ హీరోయిన్లు సాయి పల్లవి, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కూడా దీపావళికే రిలీజ్ చేసే యోచనలో నిర్మాతలు ఉన్నారు. ప్రస్తుతం రెండు టీమ్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, చివరి షెడ్యూల్ షూటింగ్స్తో బిజీగా ఉన్నాయి. ఒకవైపు రజనీకాంత్ క్రేజ్, మరోవైపు ధనుష్ కంటెంట్.. దీంతో ఈ దీపావళికి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఖాయమని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మరి ఈ క్లాష్లో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.