‘దూత’ అంటే మెసెంజర్. ఓ సంఘటన ప్రజల వద్దకు చేరవేసే జర్నలిస్ట్ కూడా దూతే. ఇది ఒక జర్నలిస్ట్ నేపథ్యంలో జరిగే కథ’ అని దర్శకుడు విక్రమ్ కె.కుమార్ అన్నారు. నాగచైతన్య హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన వెబ్సిరీస్ ‘దూత’. డిసెంబర్ 1 నుంచి ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఈ సందర్భంగా విక్రమ్ కె.కుమార్ బుధవారం విలేకరులతో ముచ్చటించారు. ‘ ఎప్పట్నుంచో నామదిలో మెదులుతున్న కథ ఇది. స్క్రీన్ప్లే రాసుకున్నప్పుడు మాత్రం వెబ్ సిరీస్ని దృష్టిలో పెట్టుకునే రాసుకున్నాను.
ఇది రెండుగంటల్లో చెప్పే కథ కాదు. ఈ కథకు ఎనిమిది ఎపిసోడ్లుని హోల్డ్ చేసేంత బలముంది. ఇదో సూపర్ నాచురల్ జానర్. ఈ జానర్కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఈ సిరీస్ 240 దేశాల్లో ప్రసారం కానుంది. ప్రపంచ నలుమూలలలో ఉన్న ప్రేక్షకులు ఈ సిరీస్ చూస్తారు. కొరియన్, ఫారిన్ షోలకు ఏ మాత్రం ‘దూత’ తీసిపోదు.’ అని విక్రమ్ కె.కుమార్ నమ్మకం వ్యక్తం చేశారు. ‘చైతూతో మూడోసారి పనిచేస్తున్నాను. మేం మంచి ఫ్రెండ్స్. ‘మనం’ టైమ్లో తనకు ఓ హారర్ కథ చెప్పాను.
తనకు ఘోస్ట్ స్టోరీస్ అంటే భయం. వద్దన్నాడు. ‘దూత’ మాత్రం తనకు బాగా నచ్చింది. ఈ సూపర్నాచురల్ కథలో చాలా లేయర్లుంటాయ్. ప్రేక్షకులను అవి థ్రిల్ల్కి గురిచేస్తాయి. ఇందులో నాగచైతన్యది ఇన్విస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్ర.’ అని తెలిపారు విక్రమ్. ‘13బి’ చేశాక, అలాంటి తరహా సినిమాలే చేయమని చాలామంది అడిగారని, డైరెక్టర్గా హారర్ ముద్ర పడిపోతుందని ఆ తరహా కథలకు ఇన్నాళ్లూ దూరంగా ఉన్నానని, ఇన్నాళ్లకు మళ్లీ నాకిష్టమైన జానర్లో సిరీస్ చేసినందుకు ఆనందంగా ఉందని, ‘దూత2’, ‘దూత3’ ఆలోచనలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. నాగచైతన్యతో పాటు పార్వతి తిరువోతు, ప్రియా భవాని శంకర్, ప్రాచీ దేశాయ్ అందరూ చక్కగా నటించారని, సాంకేతికంగా కూడా సినిమా వండర్ అనిపిస్తుందని విక్రమ్ నమ్మకం వెలిబుచ్చారు.