‘హనీట్రాప్ మాయలో పడి యువత తమ జీవితాల్ని ఎలా కోల్పోతున్నారో ఆవిష్కరిస్తూ రూపొందించిన చిత్రమిది’ అని అన్నారు పి.సునీల్కుమార్రెడ్డి. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘హనీట్రాప్’. రిషి, శిల్పానాయక్, తేజు అనుపోజు ప్రధాన పాత్రల్లో నటించారు. వామనరావు నిర్మాత. ఈ నెల 17న విడుదలకానుంది. మంగళవారం హైదరాబాద్లో సునీల్కుమార్రెడ్డి పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘సామాజిక ఇతివృత్తానికి వాణిజ్య హంగులను మేళవిస్తూ రూపొందించిన రొమాంటిక్ థ్రిల్లర్ ఇది. సోషల్మీడియా కారణంగా యువతరం ఎలా మోసాల బారిన పడుతున్నారనేది సందేశాత్మకంగా ఈ సినిమాలో చూపించాం. నేను చేసే ప్రతి సినిమాలో రొమాన్స్ ఉంటుంది. సంస్కృతిలో భాగమైన కొన్ని విషయాల్ని తెరపై ఆవిష్కరించడానికి చాలా మంది సంశయిస్తున్నారు. ఆ ధోరణిని బ్రేక్ చేయడానికే నా కథల్లో రొమాంటిక్ అంశాల్ని జోడిస్తుంటా. జయాపజయాలకు సంబంధం లేకుండా సినిమా మేకింగ్ ప్రక్రియను ఆస్వాదిస్తుంటా. అందులోని కిక్ను ఎంజాయ్ చేస్తుంటా. నా దర్శకత్వంలో మరో మూడు సినిమాలు రాబోతున్నాయి. విద్యావ్యవస్థలోని లోటుపాట్లను ఆవిష్కరిస్తూ ‘వెల్కమ్ టూ తీహార్ కాలేజీ’ అనే సినిమా చేస్తున్నా. అలాగే నక్సలిజం బ్యాక్డ్రాప్కు తండ్రీకొడుకుల అనుబంధాన్ని జోడిస్తూ చదలవాడ శ్రీనివాసరావు నిర్మాణంలో మరో సినిమా చేస్తున్నా’ అని తెలిపారు.