Sukumar – Upendra |కన్నడ నటుడు, దర్శకుడు ఉపేంద్రపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ తెలుగు దర్శకుడు సుకుమార్. ఉపేంద్ర తెరకెక్కించిన కొన్ని ‘కల్ట్ క్లాసిక్’ చిత్రాలను తాను దర్శకత్వం వహించి ఉంటే, కేవలం మూడు సినిమాలతోనే రిటైర్ అయ్యేవాడినని సుకుమార్ సరదాగా అన్నారు.
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సీతా పయనం’ చిత్ర టీజర్ విడుదల వేడుక ఇటీవల హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సుకుమార్, ఉపేంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుకుమార్ మాట్లాడుతూ, ఉపేంద్ర సినిమాల గురించి, తనపై అవి చూపిన ప్రభావం గురించి వివరించారు.
ఉపేంద్ర తీసిన ‘A’ సినిమా చూశాను. ఆ తర్వాత ‘ఓం’ చూశాను. ఇండియాలో ఏ దర్శకుడు కూడా అంత పిచ్చిగా, మ్యాడ్గా , కన్ఫ్యూజింగ్ సినిమాలు తీయలేదు. ఇప్పటికీ ‘A’ సినిమా చూస్తే అలాగే అనిపిస్తుంది అని సుకుమార్ అన్నారు. ‘ఓం’, ‘A’, ‘ఉపేంద్ర’… ఈ మూడు సినిమాలు తీసిన ఏ డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోవచ్చు. నేనైతే ఆ మూడు సినిమాలు చేసి రిటైర్ అయిపోయేవాడిని,” అని సుకుమార్ నవ్వుతూ చెప్పారు.
నిజం చెప్పాలంటే, నా సినిమాల్లో స్క్రీన్ ప్లే అలా ఉండటానికి కారణం ఆయన తెరకెక్కించిన ‘ఓం’, ‘A’, ‘ఉపేంద్ర’ చిత్రాలే. ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరచడం ఆయనకు అలవాటు. నేను ఆ విషయాన్ని ఆయన నుంచి దొంగిలించాను… కాదు తస్కరించాను, అని సుకుమార్ ఉపేంద్రపై తనకున్న గౌరవాన్ని వ్యక్తపరిచారు. కాగా సుకుమార్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి.