మా సినిమాకు బాలీవుడ్లోనూ మంచి వసూళ్లు వస్తున్నాయి. ‘విక్రమ్’, ‘పృథ్వీరాజ్’ చిత్రాలతో పాటే ‘మేజర్’ ఆదరణ పొందుతోంది. మంచి సినిమా చేస్తామని మేజర్ సందీప్ తల్లిదండ్రులకు మేమిచ్చిన మాటను నిలబెట్టుకున్నాం. గొప్ప సినిమా చేశారంటూ బాలీవుడ్, తెలుగు సినిమా ఇండస్ట్రీల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. అల్లు అర్జున్, రానా వంటి హీరోలు ఫోన్స్ చేసి సినిమా చాలా బాగా చేశారు అని మెచ్చుకుంటున్నారు. ఇవన్నీ నేను మర్చిపోలేని జ్ఞాపకాలు. సినిమా ప్రివ్యూ చూశాక సందీప్ తల్లి నన్ను హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. మేము ఎంత నిజాయితీగా పనిచేశామో ఆమె స్పందన ద్వారా తెలిసింది.
ఈ సినిమా వాస్తవానికి 2020 లోనే విడుదల అవ్వాలి. 40 పర్సెంట్ షూటింగ్ కేవలం 3 నెలల్లో పూర్తి చేశాం. ఇంతలో లాక్డౌన్ రావడం వల్ల సినిమా ఆపేయాల్సి వచ్చింది. ఈ చిత్రాన్ని మేము నిజాయితీగా తెరకెకించాం. కమర్షియాలిటీ కోసం కావాలంటే పాటలు, ఫైట్స్ పెట్టొచ్చు. కానీ మేము ఎకడా ఆ గీత దాటలేదు. అడివి శేష్తో నాకు మంచి స్నేహం ఉంది. ‘గూఢచారి’, ‘మేజర్’కి ఇద్దరం కలిసే వర్క్ చేశాం. నాకు పేరు కంటే సంతృప్తి, గొప్ప సినిమా చేశామనే సంతోషం ముఖ్యం. ‘గూఢచారి 2’ సినిమాకు నేను దర్శకత్వం వహించడం లేదు. కానీ ఆ సినిమా స్రిప్టు కానీ మరో క్రియేటివ్ విషయంలో గానీ నేను వాళ్లతో ఉంటాను. కుదిరితే ‘గూఢచారి’ ఫ్రాంఛైజీలో మరో సినిమాకు దర్శకత్వం వహిస్తా.
ఈ సినిమా నాకు తీసుకొచ్చిన గుర్తింపుతో ఇక నేను చేయబోయే సినిమాలు కూడా ఇంతే జాగ్రత్తగా చేయాలనుకుంటున్నాను. ఈ పేరును కాపాడుకుంటూనే సినిమాలు రూపొందిస్తా. ఏ సినిమా చేసినా ఏదో ఒక మంచి కథను చెప్పాలని ఉంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో ఓ సినిమాకు ఒప్పందం కుదిరింది. బ్రిటీష్ కాలపు నేపథ్యంతో ఓ సినిమా రూపొందించాలని ఉంది. ఇవాళ కొత్త దర్శకులకు ఇండస్ట్రీలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి. మీ దగ్గరకు అవకాశాలు రావు మీరే సృష్టించుకోవాలి.