Ram Gopal Varma | ఎన్ని వ్యూహాలు పన్నినప్పటికీ రామ్గోపాల్ వర్మ వ్యూహం చిత్రానికి బ్రేకులు పడలేదు. అన్ని అడ్డంకులను దాటుకుని ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. దీని సీక్వెల్గా తెరకెక్కిన శపథం సినిమా కూడా వారం రోజుల వ్యవధిలోనే థియేటర్లలోకి రాబోతుంది. ఈ క్రమంలో మంగళవారం నాడు లేటెస్ట్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని ఆర్జీవీ తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతా ద్వారా తెలియజేశారు. దీనికి డబుల్ డోస్ ట్రైలర్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా, ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ఈవెంట్లో రామ్గోపాల్ వర్మ మాట్లాడుతూ.. నారా లోకేశ్కు ఫ్లయింగ్ కిస్ ఇచ్చారు.
వ్యూహం చిత్ర ప్రమోషన్లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్లో ఆర్జీవీ మాట్లాడుతూ.. మీడియా మిత్రులు ఎవరికీ థ్యాంక్స్ చెప్పను కానీ.. తన ప్రియ మిత్రుడు నారా లోకేశ్కు థ్యాంక్స్ చెబుతానని అన్నాడు. ఇవాళ తను, దాసరి కిరణ్ కుమార్ మొహాలు చిరునవ్వుతో కళకళలాడిపోతుంది అంటే అది లోకేశ్ దయవల్లే అని పేర్కొన్నాడు. ఇక్కడ ఇన్ని కెమెరాలు ఉన్నాయని.. అందులో ఏదో ఒక కెమెరాలో తన ఫేస్ చూస్తాడని ఆశిస్తున్నానని అంటూనే లోకేశ్కు థ్యాంక్స్ చెప్పాడు. అంతేకాకుండా ఒక కిస్ కూడా ఇచ్చాడు. ఆ తర్వాత లోకేశ్ తెలివి కారణంగానే తాను సంతోషంగా ఉన్నానని అసలు విషయాన్ని వివరించాడు.
‘ నేను, కిరణ్ ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేద్దామని అనుకున్నాం. కానీ లోకేశ్ పిటిషన్ వేయడం వల్ల సినిమా వాయిదా పడింది. నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నా.. లోకేశ్ తన వ్యూహం పన్ని సినిమాను ఆపేయాలని అనుకున్నారు. డిసెంబర్లో సినిమా రిలీజై ఉంటే ఈపాటికి అందరూ మరిచిపోయేవారు. కానీ తానే లాగి లాగి ఎలక్షన్ దగ్గరకు తీసుకొచ్చాడు. ఇదే అతని గ్రేట్ తెలివి.’ అంటూ నారా లోకేశ్ను ఆర్జీవీ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ చంద్రబాబుకు కూడా థ్యాంక్స్ చెప్పారు.