‘కేజీఎఫ్’ సిరీస్ సినిమాలతో పాటు ‘సలార్’ చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నారు దర్శకుడు ప్రశాంత్నీల్. ప్రస్తుతం ఆయన ‘సలార్’ సీక్వెల్ ‘శౌర్యంగపర్వం’ షూటింగ్ కోసం సన్నద్ధమవుతున్నారు. ఈ నెలలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలావుండగా ‘కేజీఎఫ్’ సిరీస్లో వచ్చిన రెండు చిత్రాలకు పాన్ ఇండియా స్థాయిలో అపూర్వ ఆదరణ దక్కిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ సిరీస్లో మూడో సినిమా కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ‘కేజీఎఫ్-3’కి సంబంధించి అప్డేట్ను అందించారు దర్శకుడు ప్రశాంత్నీల్. ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని, హీరో యష్ ఇతర ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్నందున ఆయన డేట్స్ కోసం ఎదురుచూస్తున్నానని తెలిపారు. ‘ప్రస్తుతం ‘శౌర్యంగపర్వం’ మీదనే దృష్టి పెట్టాను. ఈ సినిమా పూర్తయిన తర్వాతే ‘కేజీఎఫ్-3’ పట్టాలెక్కుతుంది’ అని ప్రశాంత్నీల్ చెప్పారు. హీరో యష్ ప్రస్తుతం ‘టాక్సిక్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ‘రామాయణ’లో రావణాసురుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాతే ఆయన ‘కేజీఎఫ్-3’ సెట్స్లో అడుగుపెడతారని సమాచారం.