‘కామారెడ్డి ప్రాంతానికి చెందిన ఓ కుర్రాడికి ఓ సమస్య వచ్చిపడుతుంది. దాని పరిష్కారానికి అతడేం చేశాడు? హైదరాబాద్ వచ్చి తన సమస్యను ఎలా పరిష్కరించుకున్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే మా ‘వెయ్ దరువెయ్’ సినిమా.’ అన్నారు దర్శకుడు నవీన్ రెడ్డి. దర్శకుడిగా ఆయన చేసిన తొలి ప్రయత్నం ‘వెయ్ దరువెయ్’. సాయిరామ్శంకర్, యషా శివకుమార్, హెబ్బాపటేల్ ప్రధాన పాత్రధారులు.
దేవరాజ్ పోతూరు నిర్మాత. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నవీన్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘సినిమా రంగంతో మా కుటుంబానికి అనుబంధం ఉంది. నేను పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో కోర్స్ చేసి, దర్శకుడు సతీశ్ వేగేశ్న వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశాను. ఈ సినిమా నిర్మాత దేవరాజ్గారు అనుకోకుండా పరిచయం అయ్యారు. ఈ కథ ఆయనకి వినిపించాను. నచ్చడంతో సినిమా పట్టాలెక్కింది. 35రోజుల్లో సినిమా పూర్తి చేశాం.
ఇంత త్వరగా పూర్తి చేయగలిగామంటే కారణం, ప్రీప్రొడక్షన్ వర్క్కి ఎక్కువ సమయం కేటాయించడమే. నిర్మాత దేవరాజ్, హీరో సాయిరామ్శంకర్ల సహకారం వల్లే ఇదంతా సాథ్యమైంది’ అన్నారు నవీన్రెడ్డి. కథ సీరియస్ మోడ్లో ఉన్నా వినోదానికి ఢోకా ఉండదని, భీమ్స్ సంగీతం హైలైట్గా నిలుస్తుందని, హీరోయిన్స్ పాత్రలకు కూడా ప్రాధాన్యత ఉంటుందని ఆయన తెలిపారు.