2009 నుంచి 2019వరకూ ఆంధ్రప్రదేశ్లో జరిగిన రాజకీయపరిస్థితులు, వైఎస్ జగన్ పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ’యాత్ర2’. వైఎస్ రాజశేఖరరెడ్డిగా మలయాళ అగ్రనటుడు మమ్ముట్టి నటించగా, వైఎస్ జగన్మోహనరెడ్డి పాత్రలో తమిళ నటుడు జీవా నటించారు. మహి.వి.రాఘవ రూపొందిన ఈ చిత్రం గురువారం విడుదలైంది.
ఈ సందర్భంగా ఇటీవల సక్సెస్మీట్ని చిత్రబృందం నిర్వహించారు. ‘ఇది రాజకీయనాయకుడి మీద తీసిన సినిమా కాబట్టి కొందరికి నచ్చింది. ఇంకొందరికి నచ్చలేదు. ఎవరి అభిప్రాయాలను వారు పంచుకున్నారు. రివ్యూల రూపంలోకూడా. సినిమా తీయడం నా బాధ్యత. విమర్శలకు నేనేమీ బాధపడను. తండ్రీకొడుకుల కథ తీయాలని 2019లోనే నిర్ణయించుకున్నా. కథకు తగ్గట్టుగా పాత్రలు కుదిరాయి. ఇందులో కొన్ని పాత్రలు లేవేంటని కొందరు అడుగుతున్నారు.
నా కథకు తగ్గట్టే పాత్రలు పెట్టాను. జగన్ ఇంకా ఈ సినిమా చూడలేదు. త్వరలో చూస్తారు. నంద్యాల బై ఎలక్షన్ సీన్ తీసి, ఎడిటింగ్లో తీసేశాను. సినిమా విడుదలై ఒక్కరోజే అయ్యింది. సోమవారంకానీ రియాలిటీ తెలియదు. సంగీతం, విజువల్స్, డైలాగ్స్ అన్నింటికీ మంచి స్పందన వస్తున్నది. త్వరలోనే మా నుంచి ‘సేవ్ ది టైగర్స్ 2’ రాబోతున్నది. నేను కథ రాయడానికి సమయం ఎక్కువ తీసుకుంటాను. కాస్త బ్రేక్ తీసుకొని తర్వాత సినిమా గురించి చెబుతా’ అన్నారు మహి.వి.రాఘవ.