‘ఖైదీ’‘విక్రమ్’ చిత్రాలతో ప్రతిభావంతుడైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు లోకేష్ కనకరాజ్. ఆయన దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘కూలీ’ వచ్చే నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్’ అనే ఆలోచన ఎలా వచ్చిందో పంచుకున్నారాయన. ‘విక్రమ్ స్క్రిప్ట్ వర్క్ టైమ్లో కరోనా కారణంగా కొన్నాళ్లు రాజ్కమల్ ఫిల్మ్స్ ఆఫీస్లోనే ఉండిపోయా. అక్కడే ‘విక్రమ్’ కథ లాక్ చేశాం. అయితే.. అందులో ఒక పాత్ర.. ‘ఖైదీ’లోని ఇన్స్పెక్టర్ బిజోయ్ పాత్రను పోలి ఉంటుంది. అందుకే ‘ఖైదీ’లో ఆ పాత్రను పోషించిన నరేన్తోనే ఈ పాత్ర కూడా చేయించాలనుకున్నా. సరిగ్గా అప్పుడే ఒక ఆలోచన వచ్చింది.
అసలు కొత్త పాత్రను తెచ్చే బదులు.. ‘ఖైదీ’లోని బిజోయ్ పాత్రనే ‘విక్రమ్’లో కూడా కొనసాగిస్తే సరిపోతుంది కదా? అనిపించింది. దీంతో ఆ ఒక్క పాత్రనే కాక, ‘ఖైదీ’లోని సాధ్యమైనన్ని పాత్రలను క్రాస్ ఓవర్ చేయాలన్న ఆలోచన వచ్చింది. అలాగే కథలో కూడా ‘ఖైదీ’లోని పసిబిడ్డ తాలూకు ఎమోషన్, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం ఇందులోనూ యాడ్ చేశా. మొత్తం స్క్రిప్ట్ పూర్తయ్యాక కమల్సార్కి వినిపిస్తే ఆయన ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా అభినందించారు. ఆ విధంగా ‘లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్'(ఎల్సీయూ) మొదలైంది’ అంటూ చెప్పుకొచ్చారు లోకేష్ కనకరాజ్.